మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న హోల్కర్ స్టేడియం భారత క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. నేడు(జనవరి 18) భారత్ , న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేకు ఈ మైదానం ఆతిథ్యం ఇస్తోంది. ఈ స్టేడియం టీమిండియాకు ఒక కోట వంటిది. ఇక్కడ భారత్ ఆడిన గత ఏడు వన్డేల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించడం విశేషం. నేడు కూడా అదే జైత్రయాత్రను కొనసాగించి సిరీస్ను కైవసం చేసుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.
సెహ్వాగ్ అరాచకం
ఈ స్టేడియం పేరు వినగానే క్రికెట్ ప్రేమికులకు ముందుగా గుర్తొచ్చేది వీరేంద్రుడి వీరవిహారం. సరిగ్గా 14 ఏళ్ల క్రితం డిసెంబర్ 8, 2011న వెస్టిండీస్తో జరిగిన వన్డేలో సెహ్వాగ్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 149 బంతుల్లోనే 219 పరుగులు చేసి వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా చరిత్రకెక్కాడు. అందులో 25 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. అప్పట్లో కెప్టెన్గా ఉన్న సెహ్వాగ్ నెలకొల్పిన ఈ 'అత్యధిక స్కోరు' రికార్డును నేటికీ ఏ అంతర్జాతీయ కెప్టెన్ కూడా బద్దలు కొట్టలేకపోయారు.

టీమిండియా ఆల్-టైమ్ రికార్డు స్కోరు
వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్ ధాటికి ఆ రోజు భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోరును సాధించింది. పురుషుల వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో భారత జట్టుకు ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆ మ్యాచ్లో భారత్ 153 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి సిరీస్ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ 2017లో శ్రీలంకపై కెప్టెన్గా 208* పరుగులు చేసి సెహ్వాగ్ రికార్డుకు చేరువగా వచ్చినా ఆ రికార్డును దాటలేకపోయారు.
రోహిత్-కోహ్లీలకు ఆఖరి అవకాశం
నేటి మ్యాచ్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ మ్యాచ్ తర్వాత సుమారు 6 నెలల పాటు భారత జట్టు తరపున అంతర్జాతీయ వన్డేల్లో కనిపించరు. జూన్ 2026లో అఫ్గానిస్థాన్తో జరిగే సిరీస్ వరకు వీరికి వన్డే షెడ్యూల్ లేదు. కాబట్టి తమ అభిమాన ఆటగాళ్లను నీలి రంగు జెర్సీలో చూడటానికి ఫ్యాన్స్ ఈ మ్యాచ్పై భారీ ఆశలు పెట్టుకున్నారు. సెహ్వాగ్ సెంటిమెంట్ ఉన్న ఈ మైదానంలో రోహిత్ లేదా కోహ్లీ మరో భారీ ఇన్నింగ్స్ ఆడాలని అందరూ కోరుకుంటున్నారు.
వన్డేల్లో కెప్టెన్గా అత్యధిక స్కోర్లు (టాప్ 3):
*వీరేంద్ర సెహ్వాగ్ (భారత్): 219 పరుగులు vs వెస్టిండీస్ (2011)
*రోహిత్ శర్మ (భారత్): 208* పరుగులు vs శ్రీలంక (2017)
*సనత్ జయసూర్య (శ్రీలంక): 189 పరుగులు vs భారత్ (2000)