హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 గాను వేలం మంచి ఉత్కంఠతో మొదలైంది. ఈ వేడుకకు అభిమానులతో పాటు ఆటగాళ్లు సైతం ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం క్రిస్గేల్, యువరాజ్ సింగ్, జాయ్ రూట్, షేన్ వాట్సన్తో పాటు దాదాపు 1122 మంది క్రికెటర్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని శనివారం బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.
బెంగళూరు వేదికగా జనవరి 27, 28 తేదీలో ఐపీఎల్ వేలం జరుగుతుంది. ఈ వేలంలో భారత క్రికెటర్లు గౌతమ్ గంభీర్, అశ్విన్, అజింక్య రహానే, స్పిన్ మాంత్రికుడు కుల్దీప్ యాదవ్, ఓపెనర్లు కేఎల్ రాహుల్, ఎం.విజయ్ను ఎవరు కొనుగోలు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గంభీర్ను అట్టి పెట్టుకోకుండా వదిలేసింది. దీంతో గౌతీని ప్రస్తుతం ఎవరు కొనుగోలు చేస్తారనేదీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆటగాళ్ల జాబితాను ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపించారు. వీరిలో 281 మంది క్యాప్డ్ ప్లేయర్లు, 838 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు. వీరిలో 778 మంది భారతీయులు, అసోసియేట్ దేశాలకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు ఉన్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఆస్ట్రేలియా(58), దక్షిణాఫ్రికా(57), శ్రీలంక(39), వెస్టిండీస్(39), న్యూజిలాండ్(30), ఇంగ్లాండ్(26)కు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ వేలంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఐపీఎల్ పదో సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున రెండు శతకాలను నమోదు చేసిన హసీమ్ ఆమ్లా... తన దేశానికే చెందిన డుప్లెసిస్, డీకాక్, డేవిడ్ మిల్లర్, మోర్నె మోర్కెల్, రబాడాతో పోటీగా ఈ వేలంలో అత్యధిక ధర పొందే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్-11వ సీజన్ ఏప్రిల్ 4న ప్రారంభమై మే 31తో ముగియనుంది. ఏ ఆటగాళ్లు ఏ జట్టులో ఆడతారో, కొత్త ఆటగాళ్లు ఎవరు వస్తారో.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ఎవరు అత్యధిక ధర పలుకుతారో తెలియాలంటో మరికొన్ని రోజులు ఆగాల్సిందే.