
సరిగ్గా 11ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. జమైకాలోని కింగ్స్టన్లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లో తన డెబ్యూ మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో కోహ్లీ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 4పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 15పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఈ 11ఏళ్ల టైంలో కోహ్లీ దినదిన ప్రవర్ధమానమయ్యాడు. ప్రస్తుతం భారత బ్యాటింగ్ లైనప్లో అత్యంత కీలకమైన ప్లేయర్గా కోహ్లీ కొనసాగుతున్నాడు.
అలాగే టీమిండియా ఆల్ టైం బెస్ట్ ప్లేయర్లలో ఒకరిగా కూడా నిలిచాడు. ప్రస్తుతం టెస్ట్లలో నెం.4 బ్యాటింగ్ స్లాట్ అతనిదే. అలాగే టెస్ట్లలో కోహ్లీ విజయవంతమైన కెప్టెన్సీని కూడా భారత్కు అందించాడు. ఇక టెస్టుల్లో 11ఏళ్లు పూర్తి చేసిన తర్వాత కోహ్లీ సోమవారం కూ యాప్లో ఒక స్మాల్ వీడియో క్లిప్ పోస్ట్ చేశాడు. ఈ వీడియో క్లిప్లో టెస్ట్ క్రికెట్లో తన అన్ని ప్రధాన మైలురాళ్లకు సంబంధించి ఫోటోలను పోస్టు చేశాడు. ఈ వీడియోకు అతను "టైమ్ ఫ్లైస్" అని క్యాప్షన్ ఇచ్చాడు.
ఇక 33ఏళ్ల కోహ్లీ తన కెరీర్లో ఇప్పటివరకు 101టెస్టులు ఆడాడు. 49.95 సగటుతో 8,043పరుగులు చేశాడు. టెస్ట్లలో అతని అత్యధిక స్కోరు 254నాటౌట్. ఇక 2019 నవంబర్ నుంచి అతను టెస్ట్ ఫార్మాట్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేదు. ఇటీవల కోహ్లీ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన డే-నైట్ టెస్టులో బంగ్లాదేశ్పై చివరిసారిగా కోహ్లీ సెంచరీ సాధించాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాలో ఆ దేశ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్లో 1-2 తేడాతో ఇండియా ఓడిపోయిన అనంతరం కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
ఇక కోహ్లీ మొత్తం 68 టెస్ట్ మ్యాచ్లకు కెప్టెన్సీ వహించాడు. అందులో ఇండియా 40విజయాలు నమోదు చేసింది. తద్వారా అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు. మొత్తంమీద అతను టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆరో కెప్టెన్గా పేరొందాడు. అతని కంటే ముందు గ్రేమ్ స్మిత్, అలన్ బోర్డర్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, క్లైవ్ లాయిడ్లు ఉన్నారు. ఇక జులై 1 నుంచి 5వరకు ఇంగ్లాండ్తో జరగనున్న ఏకైక టెస్టు కోసం ప్రస్తుతం లండన్లో ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.