
బ్రిస్బేన్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా భారత క్రికెట్ జట్టు వచ్చే ఆదివారం తన చిరకాల ప్రత్యర్థితో తలపడబోతోంది. ఈ టోర్నమెంట్లో టీమిండియాకు ఇదే తొలి మ్యాచ్. ఆగస్టులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ముగిసిన ఆసియా కప్ 2022 తరువాత మళ్లీ భారత్-పాకిస్తాన్ తలపడబోతోండటం ఇదే తొలిసారి. రెండు నెలల వ్యవధిలోనే మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య బిగ్గెస్ట్ ఫైట్ జరగబోతోండటం ఇప్పటి నుంచే అభిమానులను ఉత్కంఠతకు గురి చేస్తోంది.
అంతకంటే ముందు- రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా రెండు వామప్ మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఇందులో ఒకటి ఆస్ట్రేలియాతో.. మరొకటి న్యూజిలాండ్తో. ఈ రెండు కూడా టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్ అధికారిక వామప్ మ్యాచ్లు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు రెండు వామప్స్ ఆడినప్పటికీ.. అవి లోకల్ టీమ్స్తో. అందులో ఒకదాంట్లో భారత్ ఓడిపోయింది కూడా. ఇప్పుడిక అఫీషియల్ మ్యాచ్లల్లో తలపడనుంది.
ప్రస్తుతం టీమిండియా బ్రిస్బేన్లో ప్రాక్టీస్లో తలమునకలైంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్..ఇలా టీమ్ మొత్తం ప్రాక్టీస్లో పాల్గొంటోంది. ఆలస్యంగా ఆస్ట్రేలియా విమానం ఎక్కిన, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.. ఇవ్వాళ జట్టును కలిసే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాపై జరిగే వామప్లో విజయం సాధించడం ద్వారా టీ20 ప్రపంచకప్ ప్రస్థానాన్ని ఘనంగా ఆరంభించాలని భావిస్తోంది.
ఇదే గ్రౌండ్లో సుమారు వందమందికి పైగా పిల్లలు క్రికెట్ ఆడుతూ కనిపించారు. వారిలో దృశీల్ చౌహాన్ అనే 11 సంవత్సరాల బాలుడు రోహిత్ శర్మ కంట్లో పడ్డాడు. ఆస్ట్రేలియాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన దృశీల్ చౌహాన్ బౌలింగ్ చేస్తోన్న తీరును చూసి మెస్మరైజ్ అయ్యాడు హిట్మ్యాన్. వెంటనే అతణ్నిపిలిపించుకున్నాడు. నెట్స్లో దృశీల్ చౌహాన్తో బౌలింగ్ చేయించుకున్నాడు.
ఆ బాలుడు సంధించిన ఇన్ స్వింగర్ యార్కర్లను ఆడలేకపోయాడు రోహిత్. కొన్ని ఓవర్ల తరువాత.. రోహిత్ శర్మ ఆ బాలుడిని డ్రెస్సింగ్ రూమ్కు తీసుకెళ్లాడు. టీమ్ మేట్స్కు పరిచయం చేశాడు. తాను సంతకం చేసిన కొన్ని ఫొటోలను అతనికి గిఫ్ట్గా అందించాడు హిట్ మ్యాన్. రోహిత్ శర్మ చర్యల పట్ల నెటిజన్లు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. క్రికెటింగ్ సూపర్ స్టార్గా ఉంటోన్న రోహిత్.. ఓ బాలుడి టాలెంట్ను మెచ్చుకోవడం పట్ల అభినందిస్తోన్నారు.