
హైదరాబాద్: క్రికెట్కు భారత్లో ఉన్నంతగా అభిమానులు ప్రపంచంలో ఎక్కడా లేరనేది వాస్తవమే. కానీ, ప్రపంచ వ్యాప్తంగా అస్సలు లేరనేది కాదు. ఈ విషయంపై ఐసీసీ తాజాగా ఓ సర్వే నిర్వహించి ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్కు వంద కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారని ఈ సర్వే తేల్చింది. ఇందులో 90శాతం వరకూ భారత్ ఉపఖండం నుంచే ఉండటం విశేషం.
ఐసీసీ ప్రఖ్యాత ఛానెల్ నీల్సన్ స్పోర్ట్స్ ద్వారా ఈ సర్వేను నిర్వహించింది. మరో విశేషం ఏమిటంటే.. వీళ్లలో 39 శాతం మహిళాభిమానులే ఉండటం. అంటే దాదాపు మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా క్రికెట్ను ఇష్టపడుతున్నారు. ఐసీసీ తన అధికారిక వెబ్సైట్, ట్విటర్లో ఈ సర్వే ఫలితాలను ఐసీసీ పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 16 నుంచి 69 ఏళ్ల మధ్య క్రికెట్ అభిమానులను సర్వే చేశారు.
క్రికెట్ అభిమానుల సగటు వయసును 34గా తేల్చారు. అంతేకాదు క్రమంగా మహిళల క్రికెట్కు ఆదరణ పెరుగుతుందపి ఈ సర్వే స్పష్టంచేసింది. సర్వేలో పాల్గొన్నవాళ్లలో 70 శాతం మంది మహిళల క్రికెట్కు మరింత లైవ్ కవరేజీ ఇవ్వాలని కోరారు. ఇక అభిమానుల్లో మూడింట రెండో వంతు మంది మూడు ఫార్మాట్లను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది.
ఐసీసీ వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్లకు విపరీతమైన ఆదరణ ఉండటం విశేషం. 95 శాతం మంది ఈ టోర్నీలు చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇంగ్లాండ్ విషయానికి వస్తే అక్కడ టెస్ట్ క్రికెట్కు ఉన్నంత ఆదరణ మరే ఫార్మాట్కు లేదంట. ఆ దేశంలో 70 శాతం మంది అభిమానులు టెస్ట్ క్రికెట్నే ఇష్టపడుతున్నట్లు సర్వే వెల్లడించింది.
దక్షిణాఫ్రికాలో వన్డేలకు, పాకిస్థాన్లో టీ20లకు ఎక్కువ ఆదరణ ఉన్నట్లు తెలిసింది. ఇక మూడు ఫార్మాట్లలో టీ20లకే ఎక్కువ ఆదరణ ఉంది. 87 శాతం మంది ఒలింపిక్స్లో క్రికెట్ ఉండాలని కోరుకుంటున్నారనీ ఈ సర్వే స్పష్టంచేసింది.