
బెంగళూరు: ఎట్టకేలకు క్రికెట్ అభిమానుల కరువు తీరనుంది. చాలా కాలం తర్వాత టీమిండియా ఆడబోయే ఓ మ్యాచ్ 100 శాతం ప్రేక్షకుల మధ్యలో జరగబోతుంది. అది కూడా త్వరలోనే జరగనుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా శనివారం నుంచి భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్కు స్టేడియం పూర్తి కెపాసిటీ సరిపడ ప్రేక్షకులను అనుమతించనున్నారు. ఈ మ్యాచ్ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ అన్న సంగతి తెలిసిందే. అయితే చాలా కాలం తర్వాత భారత్లో 100 శాతం ప్రేక్షకుల నడుమ ఓ క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. ఈ విషయాన్ని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ధృవీకరించింది. మొదట స్టేడియం సామర్థ్యంలోని 50 శాతం ప్రేక్షకులనే అనుమతించాలని భావించినప్పటికీ కర్ణాటకతోపాటు దేశంలో కరోనా మూడే వేవ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
అలాగే మ్యాచ్కు సంబంధించిన పూర్తి టికెట్లు శుక్రవారం స్టేడియం వద్ద అందుబాటులో ఉంచనున్నట్లు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు టికెట్లు విక్రయించబడతాయని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ పింక్ బాల్ టెస్టు మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ చివరగా సెంచరీని పింక్బాల్ టెస్టులోనే బంగ్లాదేశ్పై సాధించాడు. పైగా బెంగళూరు స్టేడియం విరాట్ కోహ్లీకి హోంగ్రౌండ్గా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో చిన్నస్వామి స్టేడియం అతనికి హోంగ్రౌండ్గా మారిపోయింది.
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, సిరాజ్, షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్.