సిడ్నీ: పాకిస్తాన్ పనిమాలా రెండు కీలక క్యాచులను వదిలేసి పనిగట్టుకుని ఆస్ట్రేలియాను గెలిపించేసింది. దాంతో అనుకున్నదే అయింది. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడిన పాకిస్తాన్ త్వరగానే ఆసీస్ 3 కీలకమైన వికెట్లు పడగొట్టి గెలుస్తుందేమో అనిపించింది. కానీ ఆ తర్వాత రెండు కీలక క్యాచ్ లను వదిలేసి ఆస్ట్రేలియాకు సెమీస్ కు వెళ్లే అవకాశాన్ని కట్టబెట్టింది. దీంతో భారత్ పై ఆసీస్ సెమీ ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ సిడ్నీలో ఈ నెల 26న జరుగుతుంది.
ఇకపోతే మనవాళ్ల సంగతి చూస్తే... ఆస్ట్రేలియాతో ప్రపంచకప్ పోటీల్లో సెమీ ఫైనల్లో పోటీ పడటం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆసీస్ తో భారత్ జట్టు 10 సార్లు తలపడితే అందులో 3 విజయాలను కైవసం చేసుకుంటే 7 సార్లు పరాజయం పాలైంది. కాకపోతే ఇప్పటి మన టీమిండియా కుర్రాళ్లు కాస్త దూకుడుగా ఉన్నారు. ఐనప్పటికీ గత చరిత్ర చూసినప్పుడు భారత్ క్రికెట్ క్రీడాభిమానుల్లో గుబులు రేగుతోంది. ఏదేమైనా ఆసీస్ వర్సెస్ భారత్ పోరు ఉత్కంఠగా సాగుతుందనడంలో సందేహం లేదు.

భారత్ Vs ఆస్టేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి 10 విశేషాలు:
1. వరల్డ్ కప్లో తొలిసారిగా భారత్, ఆస్టేలియాలు సెమీస్లో తలపడుతున్నాయి. గతంలో ఇరు దేశాలు లీగ్, సూపర్ సిక్స్, క్వార్టర్ ఫైనల్, పైనల్లో తలపడ్డారు.
2. ఐసీసీ వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 10 సార్లు భారత్, ఆస్టేలియా జట్లు తలపడ్డాయి. అందులో 7 సార్లు ఆస్టేలియా గెలుపొందగా, భారత్ 3 సార్లు విజయం సాధించింది. ఆసీస్ విజయం సాధించిన 7 సార్లులో రెండు సార్లు ఒక్క పరుగుతోనే ఆస్టేలియా విజయం సాధించింది.
3. గతంలో జరిగిన వరల్డ కప్స్లో ఆస్టేలియా ఇంత వరకు ఓటమిని చవిచూడలేదు. 1999లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ టై అవగా మిగతా ఐదు సార్లు (1975, 1987, 1996, 2003, 2007) ఆస్టేలియా విజయం సాధించింది.
4. టీమిండియా కెప్టెన్ ధోని సారధ్యంలో వరల్డ్ కప్లో ఒకే ఒక్కసారి ఆస్టేలియాతో భారత్ తలపడింది. ఆ మ్యాచ్లో ధోని సేన విజయం సాధించింది. ఈ మ్యాచ్ 2011లో అహ్మాదాబాద్లో జరిగింది. ఆ మ్యాచ్లో ధోని సేన ఆసీస్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
5. ఇప్పటి వరకు జరిగిన టోర్నమెంట్లో టీమిండియా ఆడిన 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇక ఆస్టేలియా విషయానికి వస్తే న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో ఓడిపోగా, మిగిలిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించింది.
6. వరల్డ్ కప్లో ఆస్టేలియాపై సెంచరీ సాధించిన ఒకే ఒక్క ఆటగాడు అజయ్ జడేజా. అదే భారత్పై రికీ పాంటింగ్ 2 సెంచరీలు సాధించాడు.
7. 2011 వరల్డ్ కప్లో భారత్, ఆస్టేలియా తరుపున ఆడిన ఆటగాళ్లలో మైఖేల్ క్లార్క్, షేన్ వాట్సన్, బ్రాడ్ హడిన్, మిఛెల్ జాన్సన్, ధోనీ, విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్, సురేష్ రైనాలు ఉన్నారు.
8. ప్రస్తుత వరల్డ్ కప్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో తొలిసారి భారత్ ఆస్టేలియాతో తలపడుతుంది. ఆస్టేలియా మాత్రం రెండోసారి. లీగ్ దశలో శ్రీలంకపై జరిగిన మ్యాచ్లో ఆస్టేలియా విజయం సాధించింది.
9. మార్చి 26న జరిగే మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే రికార్డు కానుంది. వరుసగా రెండోసారి పైనల్స్కు అర్హత సాధించడమే. గతంలో భారత్ 1983 (won), 2003 (lost), 2011 (won) వరల్డ్ కప్ పైనల్స్లో రెండు విజయాలు, ఒక పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆస్టేలియా విషయానికి వస్తే 6 సార్లు వరల్డ్ కప్ ఫైనల్స్కు అర్హత సాధించింది.
10. ఏ కారణం చేతనైనా సెమీ ఫైనల్ మ్యాచ్ రద్దైతే ఇండియా నేరుగా పైనల్కు అర్హత సాధిస్తుంది. కారణం లీగ్ దశ (పూల్ బీలో నెంబర్ 1)లో అన్ని మ్యాచ్ల్లో వరుస విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో ఉంది కాబట్టి. ఇక ఆస్టేలియా (పూల్ ఏలో నెంబర్ . 2)లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.