కోల్కతాకు చెందిన అంతర్జాతీయ మహిళా బాక్సర్ సుమన్ కుమారిపై ఓ దుండగుడు దాడికి పాల్పడ్డాడు. దక్షిణ కోల్కతాలోని మోమిన్పూర్ ప్రాంతంలో ఉదయం ఈ ఘటన జరిగినట్టు బాక్సర్ సుమన్ తన ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. దుండగుడు తనను దుర్భాషలాడడమే గాకుండా భౌతికంగా దాడికి పాల్పడ్డాడని తెలిపింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
సుమన్ కుమారి ఉదయం 11 గంటలకు స్కూటీపై ఆఫీసుకు వెళుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అడ్డొచ్చాడు. అతికష్టమ్మీద స్కూటీని ఆపినా.. ఆ వ్యక్తి దుర్భాషలాడాడు. ఎందుకు తిడుతున్నావని అడగడంతో అతను హఠాత్తుగా సుమన్ గొంతు పట్టుకొన్నాడు. పక్కనే ఉన్న పోలీసును పిలిచినా అతను పట్టించుకోలేదు.
'నాకింకా కోల్కతా పోలీసులపై నమ్మకం ఉంది. ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కోరుతున్నా. అప్పుడే కోల్కతా నగరంలో మహిళలు స్వేచ్ఛగా తిరగగలరు' అని సుమన్ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేశారు.
జూన్ 18న మిస్ ఇండియా ఉషోషి సేన్గుప్తా కూడా ఇదే విధంగా దాడికి గురయ్యారు. కోల్కతాలోని ఓ యువకుల మూక బైక్ మీద వచ్చి దాడి చేశారని సోషల్ మీడియా వేదికగా ఉషోషి వెల్లడించారు. ఈ రెండు ఘటనతో కోల్కతా నగరంలోని పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.