
భారత దిగ్గజ మహిళా బాక్సర్, ఆరు సార్లు ప్రపంచ విజేత మేరీకోమ్ (36) తన రిటైర్మెంట్ ప్రణాళికలను వెల్లడించింది. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన తర్వాతే ఆటకు గుడ్బై చెబుతానని మేరీకోమ్ స్వయంగా తెలిపింది. మరోవైపు ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకెలుతా అని ధీమా వ్యక్తం చేసింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
గురువారం మేరీకోమ్ మాట్లాడుతూ... '2020 ఒలింపిక్స్ తర్వాత రిటైరవుతా. అంతకుముందు టోక్యోలో భారత్కు బంగారు పతకం అందించడమే నా లక్ష్యం. స్వర్ణం సాధించడంపైనే దృష్టి పెట్టా. ఎట్టి పరిస్థితుల్లోనైనా స్వర్ణ పతకం సాధిస్తా. ప్రతిసారి దేశానికి పతకం అందించేందుకు నా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తా. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్, ప్రపంచ ఛాంపియన్షిప్ కోసం సాధన మొదలుపెడతా' అని మేరీకోమ్ చెప్పింది.
'చాలా మంది యువత ఇపుడు రింగులోకి దిగుతున్నారు. త్వరలోనే మరో మేరీకోమ్ ను ప్రజలు చూస్తారని ఆశిస్తున్నా. మరో మేరీకోమ్ రావాలని కోరుకుంటున్నా' అని ఆమె తెలిపింది. మేరీకోమ్ తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలవడంతో పాటు 2012 ఒలింపిక్స్లో కాంస్యం, ఆసియా చాంపియన్షిప్లో ఐదుసార్లు పతకాలను సాధించింది.
2020లో ఒలింపిక్స్ జరుగనుండటంతో క్వాలిఫయర్స్ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) నూతన షెడ్యూల్ను విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది జనవరి నుంచి మే వరకు క్వాలిఫయింగ్ పోటీలు జరుగనున్నాయి. తాజా నిర్ణయంతో.. మణిపుర్ బాక్సర్ మేరీకోమ్ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించింది.