
తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ గత వారం మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ చరిత్రలో బంగారు పతకాన్ని సాధించిన ఐదో భారతీయ మహిళగా నిఖత్ నిలిచి ఇండియాకు గర్వకారణంగా నిలిచింది. ఇకపోతే మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్లో 6బంగారు పతకాలు సాధించిన భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్తో దిగిన ఓ ఫోటోను నిఖత్ జరీన్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో కింద 'నా ఆరాధ్య బాక్సర్ ఆశీర్వాదం తీసుకోకపోతే ఈ విజయానికి సార్థకత లభించదు' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింటా వైరల్గా మారింది. 10,000కి పైగా 'లైక్లు' మరియు 500కు పైగా రీట్వీట్లు వచ్చాయి.
ఇకపోతే 2020టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించే విషయంలో నిఖత్ జరీన్, మేరీ కోమ్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 2019లో మేరీ కోమ్ వర్సెస్ నిఖత్ జరీన్ గా జరిగిన ఈ రచ్చ క్రీడాలోకంలో అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. మహిళల బాక్సింగ్ ఒలింపిక్ ఎంపిక కోసం ట్రయల్స్ నిర్వహించకుండానే మేరీ కోమ్ను తీసుకోవడంతో నిఖత్ జరీన్ గొంతెత్తింది. ఎట్టకేలకు ట్రయల్స్ జరగగా ఆ మ్యాచ్లో మేరీ కోమ్ గెలిచింది. గెలిచాక తన ప్రత్యర్థి అయిన నిఖత్ జరీన్ ముఖం కూడా చూడకుండా కరచాలనం కూడా చేయకుండా విసురుగా వెళ్లిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. నేను ఆమెతో ఎందుకు కరచాలనం చేయాలి? ఇతరులు ఆమెను గౌరవించాలని ఆమె కోరుకుంటే, ఆమె మొదట ఇతరులను గౌరవించాలి కదా.. అలాంటి స్వభావం ఉన్న వ్యక్తులను నేను ఇష్టపడనంటూ మేరీ కోమ్ కామెంట్లు చేసింది. ఇక నోరుంది కదా అని బయట గొంతెత్తడం కాదు రింగ్ లోపల నిరూపించుకోవాలి అంటూ అప్పట్లో మేరీ కోమ్ అంది. అయితే తాజాగా వీరిద్దరు ఆ వివాదాన్ని మర్చిపోయి మళ్లీ కలుసుకుని ఆత్మీయంగా సంభాషించుకున్నారు.
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్.. నిఖత్ జరీన్ భారీ విజయం సాధించిన తర్వాత ఆమెను మనస్ఫూర్తిగా అభినందించారు. 'బంగారు పతకాన్ని గెలుచుకున్నందుకు జరీన్ కు అభినందనలు, మీ విజయం పట్ల గర్వంగా ఉంది. మీ భవిష్యత్ మరింత ఉజ్వలంగా సాగాలని కోరుకుంటున్నా' అని మేరీ కోమ్ ట్వీట్ చేసింది. ఇకపోతే నిఖత్ జరీన్ షేర్ చేసిన ఫోటోలో మేరీకోమ్ చిరునవ్వులు చిందిస్తూ కన్పించింది. ఇకపోతే టర్కీలో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 52కేజీల ఈవెంట్లో జరీన్ 5-0తేడాతో ఏకగ్రీవంగా థాయ్లాండ్కు చెందిన జిట్పాంగ్ జుటామాస్పై విజయం సాధించింది.