
ఢిల్లీ: కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఏషియా గేమ్స్ మాజీ గోల్డ్ మెడలిస్ట్ డింకో సింగ్ (41) శుక్రవారం ఢిల్లీకి చేరుకోనున్నారు. డింకో సింగ్ ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్లో ఇంఫాల్ నుండి ఢిల్లీకి వెళతారు. క్యాన్సర్కు చికిత్సను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉన్నందున అతన్ని హుటాహుటిన ఢిల్లీకి తీసుకెళనున్నారు. అయితే పద్మ అవార్డు గ్రహీత డింకోకు ఎయిర్ అంబులెన్స్ సేవను ఉచితంగా అందిస్తామని స్పైస్ జెట్ ఒక ప్రకటనలో తెలిపింది.
డింకో సింగ్ను ఢిల్లీకి తీసుకెళ్లడానికి స్పైస్ జెట్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. అతడు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కూడా. ఎయిర్ అంబులెన్స్ సేవను స్పైస్ జెట్ ఈ సంవత్సరమే ప్రారంభించింది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకే ఈ సేవలు ఉపయోగించనున్నారు.
డింకో సింగ్ కొంతకాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. ఈ బాక్సింగ్ ఛాంపియన్ 15 రోజుల క్రితం రేడియేషన్ థెరపీ చేయించుకోవాల్సి ఉంది. మహమ్మారి కరోనావైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండడంతో డింకో ఇపాల్లోని తన ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో అతడు సరైన చికిత్స తీసుకోలేక పోతున్నాడు. చొరవ తీసుకున్న బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేసింది. ఈ రోజు డింకో ఢిల్లీకి చేరుకోనున్నారు.
లివర్ క్యాన్సర్తో పోరాడుతున్న డింకోకి అండగా నిలిచేందుకు భారత బాక్సర్లు ముందుకొచ్చారు. చేతనైనంత ఆర్థిక సాయం చేసి అతనికి అండగా నిలబడ్డారు. స్టార్ బాక్సర్లు విజేందర్ సింగ్, మనోజ్ కుమార్ చొరవతో ఈ కార్యక్రమం మొదలైంది. 'హమ్ మే హై దమ్' పేరుతో పలువురు బాక్సర్లు, కోచ్లు ఉన్న వాట్సాప్ గ్రూప్లో మనోజ్ కుమార్ ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. మంగళవారం సాయంత్రం డింకోసింగ్ బ్యాంక్ ఖాతా వివరాలు లభించిన తర్వాత తొలుత విజేందర్ తన వంతుగా రూ.25 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత మిగిలిన వారు తమ స్థాయి మేరకు డబ్బు పంపారు. ఇలా ఇప్పటి దాకా లక్ష రూపాయలకు పైగా డింకోసింగ్ అకౌంట్లో జమచేశారు. ఈ డిపాజిట్లు ఇంకా కొనసాగుతున్నాయి.