
హైదరాబాద్: ఒలింపిక్ టెస్ట్ ఈవెంట్లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాలతో మెరిశారు. శివ థాపా (63 కిలోలు), పూజ రాణి (మహిళల 75 కిలోలు) స్వర్ణ పతకాలు సాధించగా... ఆశీష్ (69 కిలోలు) రజతంతో మెరిశాడు. శివ థాపా ఫైనల్లో కజక్స్థాన్ జాతీయ ఛాంపియన్, ఆసియా కాంస్య పతక విజేత సనటాలి టోల్తయేవ్ను 5-0తో చిత్తుగా ఓడించాడు.
ఈ ఏడాది శివ థాపా జాతీయ ఛాంపియన్గా నిలవగా.. అంతకముందు ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు. అంతేకాదు ఆసియా గేమ్స్లో నాలుగు సార్లు పతకాలు సాధించాడు. ఇక, మహిళల 75 కిలోల ఫైనల్లో పూజ రాణి తన ప్రత్యర్థి కైట్లిన్ పార్కర్ (ఆస్ట్రేలియా)ను చిత్తుగా ఓడించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
మరో భారత బాక్సర్ ఆశీష్ (60 కిలోలు) విభాగంలో జపాన్ బాక్సర్ సెవాన్ ఒకజవా చేతిలో ఓడటంతో రజిత పతకానికే పరిమితమయ్యాడు. అంతకముందు తెలుగు బాక్సర్ నిఖత్ జరీన్తోపాటు సిమ్రన్జిత్ కౌర్, సుమిత్, వహ్లింపుయా సెమీస్లో ఓడి కాంస్యాలకే పరిమితమయ్యారు.
51 కిలోల సెమీఫైనల్స్లో నిఖత్.. జపాన్ బాక్సర్ సనా కవానో చేతిలో ఓడగా.... సిమ్రన్జిత్ కౌర్ (60 కిలోలు) విభాగంలో కజక్ బాక్సర్ రిమ్మా ఒలోసెంకో చేతిలో ఓడిపోయింది.