
81 కేజీల విభాగంలో రజత పతకం
2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. దేశం తరఫున పతకాలు సాధిస్తూ ఓ వెలుగు వెలగాల్సిన అతడి జీవితాన్ని రోడ్డు ప్రమాదం తలకిందులు చేసింది. 2014 కామన్వెల్త్ క్రీడలకు ముందు ట్రైనింగ్ క్యాంప్కు వెళుతుండగా అతడు ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొనడంతో దినేష్ తీవ్రంగా గాయపడ్డాడు.

రోడ్డు ప్రమాదంలో రెండుచోట్ల విరిగిన కుడి చేతి ఎముక
ఈ ప్రమాదంలో అతడి కుడి చేతి ఎముక రెండుచోట్ల విరగడంతో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. దీంతో బాక్సింగ్కు దూరమయ్యాడు. అయితే, కొడుకును రక్షించుకోవాలనే తాపత్రయంతో అతడి తండ్రి అప్పులు చేసి దినేష్ వైద్యానికి ఖర్చు చేశాడు. వడ్డీలు అంతకంతకూ పెరిగిపోవడంతో బాకీలు తీర్చడానికి దినేష్ కూడా ఆయనతోపాటు కుల్ఫీలు అమ్మడానికి రోడ్లపైకి వచ్చాడు.

కుల్ఫీలు అమ్మాల్సి వస్తోందంటూ దినేశ్ ఆవేదన
ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందకపోవడంతో కుల్ఫీలు అమ్మాల్సి వస్తోందని దినేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. "నన్ను బాక్సర్గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది. చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది" అని అన్నాడు.

తనకు ఉద్యోగ భద్రత కల్పిస్తే
"ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా కుల్ఫీ (ఐస్క్రీమ్)లు అమ్మేందుకు సిద్ధమయ్యా. తనకు ఉద్యోగ భద్రత కల్పిస్తే.. భవిష్యత్ ఆటగాళ్లను తయారు చేయగల అనుభవం ఉంది" అని ఆవేదనగా చెప్పాడు.


Click it and Unblock the Notifications












