
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో భారత బాక్సర్, తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. సెమీస్లో అద్భుతమైన విజయంతో బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఫైనల్ చేరిన ఆమె.. తుదిపోరులో కూడా చెలరేగింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ క్రీడా ప్రాంగణంలో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి స్వర్ణ పతకం సాధించింది. మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో నిఖత్కు ఇది వరుసగా రెండో స్వర్ణ పతకం కావడం గమనార్హం.
ఈ పతకంతో వరుసగా రెండు సార్లు ఈ మెడల్ సాధించిన రెండో భారత మహిళా బాక్సర్గా నిఖత్ హిస్టరీ క్రియేట్ చేసింది. అంతకుముందు లెజెండరీ బాక్సర్ మేరీ కోమ్ కూడా రెండు వరల్డ్ టైటిల్స్ నెగ్గింది. 50 కేజీల విభాగంలో బరిలో దిగిన నిఖత్.. సెమీఫైనల్ బౌట్లో 5-0 తేడాతో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, కొలంబియా అమ్మాయి ఇంగ్రిట్ వాలెన్సిని ఓడించి ఫైనల్ చేరింది. తుది పోరులో కూడా చెలరేగిన ఆమె వియత్నాం బాక్సర్ ఎన్గుయెన్ థి టామ్ను 5-0 తేడాతో చిత్తుగా ఓడించింది.
అద్భుతంగా సాగిన ఈ ఫైనల్ పోరులో నిఖత్ జరీన్ తొలి రౌండ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయితే రెండో రౌండ్లో ఎన్గుయెన్ తేరుకొని మంచి పోరాట పటిమ కనబరిచింది. ఆ తర్వాత మూడో రౌండ్లో మళ్లీ నిఖత్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. చివరకు న్యాయనిర్ణేతలంతా ఏకగ్రీవంగా నిఖత్ 5-0 పాయింట్ల తేడాతో విజయం సాధించిందని ప్రకటించారు. గతేడాది కూడా ఇలాగే నిఖత్ జరీన్ ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.
అంతకుముందు క్వార్టర్ఫైనల్లో థాయ్లాండ్కు చెందిన చుతామత్ రక్సాత్ను 5-2తో నిఖత్ చిత్తుచేసి టోర్నీలో ముందడుగు వేసింది. కాగా, గతేడాది కూడా వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ విజేతగా నిలిచిన నిఖత్ జరీన్.. సొంతగడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో కూడా స్వర్ణమే టార్గెట్గా బరిలో దిగింది. ఇది గెలిచిన ఆత్మవిశ్వాసంతో పారిస్ ఒలింపిక్స్ బరిలో దిగాలనేది నిఖత్ జరీన్ ఆలోచన. మేరీ కోమ్ నీడలో ఎదిగిన ఆమె గతేడాది నుంచే తన పంచ్ పవర్ను ప్రపంచానికి చాటిచెప్తోంది.