
ఇంటికే పరిమితం:
మహమ్మద్ హుసాముద్దీన్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నాడు. 'ప్రపంచకప్ బాక్సింగ్ టోర్నీలో కాంస్యానికే పరిమితమైనప్పటికీ.. ఆ పతకం నా ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచింది. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనడమే లక్ష్యంగా సాగుతున్న నాకు ఓ ప్రేరణనిచ్చింది. ఎందుకంటే నేను చివరగా టోర్నీలో పాల్గొంది ఫిబ్రవరిలో. ఆ తర్వాత కరోనా మహమ్మారి లాక్డౌన్ వల్ల ఆటలన్నీ ఆగిపోయాయి. బాక్సర్లందరిలాగే నేనూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అనంతరం పరిస్థితులు మెరుగు పడుతుండడంతో సాయ్ నిర్వహించిన శిక్షణ శిబిరానికి హాజరయ్యా. ఆ తర్వాత ఐరోపాలో శిక్షణ కోసం భారత బృందంతో కలిసి వెళ్లా. అక్కడ అంతర్జాతీయ బాక్సర్లతో కలిసి సాధన చేయడం ఎంతో ఉపయోగపడింది' అని హుసాముద్దీన్ చెప్పాడు.

ఆటతీరును మార్చుకున్నా:
'ఐరోపాలో శిక్షణ ద్వారా తిరిగి ఫిట్నెస్ సాధించా. ఆటతీరును మార్చుకున్నా. గతంలో కంటే ఎంతో మెరుగయ్యా. ఇప్పుడు రింగ్లో ఒకచోట కుదరుగా నిలబడి పంచ్లు విసరగలుగుతున్నా. టెక్నిక్ కూడా మెరుగైంది. అయినప్పటికీ దాదాపు 9 నెలల విరామం తర్వాత తొలిసారిగా బరిలో దిగడంతో ఆ ప్రపంచకప్ టోర్నీకి ముందు కాస్త ఒత్తిడి ఎదుర్కొన్నా. ఇన్ని రోజులు సాధన చేసినప్పటికీ.. పోటీలకు దూరంగా ఉన్నా కాబట్టి రింగ్లో అడుగుపెట్టాక ఎలా స్పందిస్తానో అని సందేహించా. కానీ తొలి బౌట్లో విజయంతో అనుమానాలన్నీ దూరమయ్యాయి. మునుపటి జోరును ప్రదర్శించా' అని 26 ఏళ్ల హుసాముద్దీన్ పేర్కొన్నాడు.

గాయమైనా :
'అప్పుడు క్వార్టర్స్లో జర్మనీ బాక్సర్తో పోరులో కనుబొమ్మకు గాయమైనప్పటికీ బౌట్ నుంచి మధ్యలో తప్పుకోవాలనుకోలేదు. ఏది ఏమైనా విజయం సాధించాలనుకున్నా. అందుకే రక్తం కారినప్పటికీ ఆట ఆపలేదు. గతంలో ఒకసారి అదే చోట గాయమైంది. తర్వాత కోలుకున్నా. మళ్లీ ఇప్పుడు కూడా అక్కడే దెబ్బ తగిలింది. అయినా ప్రత్యర్థికి తలవంచాలని భావించలేదు. అందుకే గాయమైనా పంచ్లు విసిరా. ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా దక్కకుండా మ్యాచ్ ముగించా. అయితే బౌట్ తర్వాత గాయానికి కుట్లు వేశారు. దీంతో సెమీస్లో పాల్గొనే విషయంపై సందిగ్ధత ఏర్పడింది. కానీ వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ దిశగా సాగుతున్న నాకు మంచి ప్రాక్టీస్ కావాలంటే బౌట్లో పాల్గొనాల్సిందేనని నిర్ణయించుకున్నా. కానీ గాయం బాధిస్తుండడంతో రింగ్లో వంద శాతం ప్రదర్శన ఇవ్వలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లో ఓటమి వైపు నిలవాల్సి వచ్చింది' అని తెలంగాణ కుర్రాడు చెప్పుకొచ్చాడు.

అదే నా కల:
'టోక్యో ఒలింపిక్స్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలన్నదే నా కల. గత ఒలింపిక్స్ సమయంలో వెన్నునొప్పితో అర్హత టోర్నీలకు దూరమయ్యా. కానీ ఈ సారి మాత్రం అవకాశం వదలను. ప్రస్తుతం నిజామాబాద్లోనే ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటున్నా. ఇంకా గాయానికి వేసిన కుట్లు విప్పలేదు. దాని నుంచి కోలుకున్న తర్వాత బెంగళూరులో జాతీయ శిబిరంలో పాల్గొంటా' అని హుసాముద్దీన్ అన్నాడు. జర్మనీ ప్రపంచకప్ టోర్నీలో భారత బాక్సర్లు గొప్పగా రాణించారు. మూడు స్వర్ణాలు సహా మొత్తం తొమ్మిది పతకాలు సాధించారు.

బాక్సింగ్ పోటీలు:
ఆగస్టు ఐబా ప్రపంచ చాంపియన్షిప్
నవంబర్ ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్
ఎంత పనిచేశావ్ పంత్.. ఐసోలేషన్లో ఐదుగురు భారత క్రికెటర్లు!! సిడ్నీ టెస్టులో ఆడుతారా?


Click it and Unblock the Notifications












