
హైదరాబాద్: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్(23) చేసిన విజ్ఞప్తిపై కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. స్టార్ బాక్సర్ మేరీ కోమ్ కోసం రెండోసారి తన కెరీర్ను పక్కన పెట్టిన వైనంపై హైదరాబాద్ బాక్సర్ నిఖత్ జరీన్ ఆవేదన వ్యక్తం జేసింది. సెలెక్షన్స్ నిర్వహించకుండా టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి మేరీని పంపాలనుకుంటున్న భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) తీరుపై కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజుకు లేఖ రాసింది.
నిఖత్ జరీన్ లేఖపై కేంద్ర మంత్రి కిరమ్ రిజుజు తన ట్విట్టర్లో దేశ ప్రయోజనాలు, క్రీడలు, అథ్లెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు. క్రీడాకారుల ఎంపికలో మంత్రి జోక్యం ఉండదని.. సెలక్షన్ కమిటీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
"దేశ ప్రయోజనాలు, క్రీడలు, అథ్లెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్తాను. ఒలింపిక్ చార్టర్ ప్రకారం క్రీడాకారుల ఎంపికలో మంత్రి జోక్యం ఉండదని.. స్వయం ప్రతిపత్తి కలిగిన క్రీడా సమాఖ్య స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుంది" అని ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
2020లో జరిగే ఒలింపిక్స్కు జపాన్ రాజధాని టోక్యో ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొనేందుకు గాను వచ్చే ఫిబ్రవరిలో ఒలింపిక్ క్వాలిఫయర్ పోటీలు చైనాలో జరుగుతాయి. ఇందులో పాల్గొనే బాక్సర్లను ట్రయల్స్ ద్వారా ఎంపిక చేయాలి. కానీ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) మాత్రం ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు సాధించిన విజేతలను నేరుగా ఎంపిక చేసింది.
ఇటీవల రష్యాలోని ఉలాన్ ఉదెలో ముగిసిన ప్రపంచ ఛాంపియన్షిప్లో 51 కేజీల విభాగంలో మేరీకోమ్ కాంస్య పతకం సాధించింది. అయితే టోక్యో ఒలింపిక్స్ కోసం మేరీ 48 కేజీల విభాగం నుంచి 51 కేజీలకు మారింది. ఇదే ఇప్పుడు నిఖత్ జరీన్కు శాపంగా మారింది. మొదటి నుంచీ 51 కేజీల బరిలో రాణిస్తోన్న నిఖత్ జరీన్కు మేరీ అడ్డుగా మారింది.
మేరీ కోమ్ స్టార్ బాక్సర్ కావడంతో భారత బాక్సింగ్ సమాఖ్య (బీబీఎఫ్) ఆమెకే మద్దతుగా నిలిచింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం భారత్ తరఫున మేరీకోమ్ను పంపాలనుకుంటున్నట్లు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్సింగ్ చెప్పకనే చెప్పాడు. దీంతో తాను పోటీ పడే 51 కేజీల విభాగంలో సెలక్షన్ ట్రయల్సే లేకుండా మేరీకోమ్ను నేరుగా పంపడాన్ని నిఖత్ జరీన్ ప్రశ్నించింది.
ఒలింపిక్స్ ట్రయల్స్ పెట్టకపోవడాన్ని ప్రశ్నించిన నిఖత్ జరీన్కు ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా మద్దతు పలికాడు. "మేరీకోమ్ అంటే నాకెంతో గౌరవం ఉంది. అథ్లెట్ జీవితమనేది సాక్ష్యం కోరుకుంటుంది. వాస్తవం మాట్లాడుకుంటే ఏ అథ్లెట్కైనా వారి ప్రస్తుత ప్రదర్శన పైనే కెరీర్ ఆధారపడి ఉంటుంది. వాళ్ల ప్రదర్శన ప్రస్తుతం గతంలోలా ఉండకపోవచ్చు. గతం అనేది క్రీడల్లో లెక్కలోకి రాదు" అని బింద్రా ట్వీట్ చేశాడు.