బాక్సింగ్ దిగ్గజం, వరల్డ్ బెస్ట్ బాక్సర్ మైక్ టైసన్ ఓటమిపాలయ్యాడు. యూట్యూబర్ జేక్ పాల్తో జరిగిన పోరులో 74-78 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. 19 ఏళ్ల క్రితం ఆటకు గుడ్బై చెప్పిన మైక్ టైసన్ ఈ మ్యాచ్తో పునరాగమనం చేశాడు. అయితే తొలి రెండు రౌండ్లలో సత్తాచాటిన టైసన్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపొయాడు.
మొత్తం ఎనిమిది రౌండ్లలో మైక్ టైసన్ రెండు రౌండ్లలోనే పైచేయి సాధించాడు. జేక్ పాల్ ఆరు రౌండ్లలో గెలుపొందాడు. బౌట్లోకి దిగి తొలి రౌండ్లో ప్రత్యర్థిపై పంచ్లతో విరుచుకుపడ్డాడు. 10-9తో తొలి రౌండ్ను ముగించాడు. అదే ఉత్సాహంతో రెండు రౌండ్ను ఘనంగా ముగించాడు. కానీ ఆ తర్వాత జేక్ పాల్ పుంజుకోవడంతో మైక్ టైసన్ నిలవలేకపోయాడు. 10-9, 10-9, 9-10, 9-10, 9-10, 9-10, 9-10, 9-10తో పోరును ముగించాడు.

బాక్సింగ్ కింగ్గా ప్రసిద్ధి చెందిన మైక్ టైసన్ 2005లో కెవిన్ చేతిలో ఓటమి తర్వాత ప్రొఫెషనల్ బాక్సింగ్కు గుడ్బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టైసన్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. తన ఆస్తులను మొత్తం పోగొట్టుకున్నాడు. దాంతో తన కనీస అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు అవసరమైన నేపథ్యంలో మైక్ టైసన్.. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత 58 ఏళ్ల వయసులో తిరిగి రింగ్లోకి దిగాడు.
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ఏర్పాటు చేసిన ఈవెంట్లో 27 ఏళ్ల యూట్యూబర్ జేక్ పాల్తో తలపడడానికి అంగీకరించి బరిలోకి దిగాడు. ఈ పోటీలో పాల్గొన్నందుకు మైక్టైసన్కు 20 మిలియన్ డాలర్లు దక్కనున్నాయి. అయితే వెయిటేజ్ ఈవెంట్లో జరిగిన సంఘటనతో ఈ పోరుపై మరింత ఆసక్తి పెరిగింది. ఇద్దరు బాక్సర్ల వెయిటేజ్ ఈవెంట్ జరగ్గా.. మైక్టైసన్ తన ప్రత్యర్థి అయిన జేక్ పౌల్ చెంప చెల్లమనిపించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బాక్సర్లిద్దరినీ అడ్డుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. కాగా, విజయానంతరం జేక్ పాల్ మాట్లాడుతూ.. మైక్ టైసన్ను కొనియాడాడు. టైసన్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ అని పేర్కొన్నాడు.