
ఇండియా ఓపెన్ బాక్సింగ్ టోర్నీలో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, స్టార్ బాక్సర్ మేరికోం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ కూడా సెమీస్లో దూసుకొచ్చింది. దీంతో భారత్ కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం
కర్మబీర్ నబిన్ చంద్ర బోర్డోలోయ్ ఇండోర్ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన మహిళల 51 కేజీల విభాగం క్వార్టర్ఫైనల్లో మేరీ 5-0తో మలారాయ్ (నేపాల్)ను చిత్తుగా ఓడించి సెమీస్లోకి ప్రవేశించింది. మేరి ఆది నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో చెలరేగి మట్టికరిపించింది. 51కిలోల మరో క్వార్టర్స్లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ 5-0తో భారత్కే చెందిన అనామికపై అలవోక విజయం సాధించి సెమీస్లో మేరికోంతో పోరుకు సిద్ధమైంది.
తన ఆరాధ్యదైవమైన మేరీతో నిఖత్ పోటీపడుతుండడంతో ఈ బౌట్పై ఆసక్తి నెలకొంది. దక్షిణాసియా క్రీడల్లో మేరికోం చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో నిఖత్ జరీన్ ఉంది. మిగతా భారత బాక్సర్లలో సరితా దేవి (60 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు), మంజు రాణి (48 కేజీలు) కూడా సెమీఫైనల్కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు.