భారత్ బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రిటైర్మెంట్ ప్రకటించిది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆమె వయసు కారణంగా ఆట నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది. తనకు బాక్సింగ్ను విడిచిపెట్టాలని లేదని, కానీ వయోపరిమితి దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. ప్రస్తుతం మేరీకోమ్కు 41 ఏళ్లు. అయితే ఎలైట్ లెవల్లో బరిలోకి దిగాలంటే గరిష్ఠ వయోపరిమితి 40 ఏళ్లు మాత్రమే.
''నాకు ఇంకా ఆడాలని ఉంది. దురదృష్టవశాత్తు వయోపరిమితిని దాటేశాను.దీంతో మళ్లీ రింగ్లోకి అడుగుపెట్టలేకపోతున్నా. మరికొంత కాలం బరిలోకి దిగాలని ఉన్నప్పటికీ బలవంతంగా ఆట నుంచి వైదొలుగుతున్నాను. నా జీవితంలో అనుకున్నవన్నీ సాధించా'' అని మేరీకోమ్ తెలిపింది.

మేరీకోమ్ తన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించింది. భారత్ బాక్సింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రికార్డులు అందుకుంది. 2012 ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచి దేశఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఎదుర్కొన్న తొలి పోరులోనే ఫైనల్ వరకు చేరి అందరి దృష్టి తనవైపునకు తిప్పుకుంది. 18 ఏళ్ల వయసులో పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో మేరీకోమ్ అంతర్జాతీయ పోటీలో అరంగేట్రం చేసింది.
మేరీకోమ్ అయిదుసార్లు ఏషియన్ ఛాంపియన్గా నిలిచింది. ఆసియా క్రీడల్లో స్వర్ణాన్ని సాధించిన భారత తొలి మహిళా బాక్సర్గా మేరీకోమ్ రికార్డు నెలకొల్పింది. 2005, 2006, 2008, 2010, 2018లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. అయితే 2022లో కామన్వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్ సమయంలో మేరీకోమ్ మోకాలికి గాయమైంది. ఆ తర్వాత నుంచి ఆటకు దూరంగా ఉంది. మణిపుర్కు చెందిన మేరీకోమ్కు ముగ్గురు పిల్లలు. క్రీడారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తుగా 2016లో రాజ్యసభ సభ్యురాలిగా కేంద్రం నియమించింది.