
ఉలన్-ఉడె (రష్యా): భారత బాక్సర్ మంజురాణి బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్ ఫైనల్కు దూసుకెళ్లింది. 48 కేజీల విభాగంలో శనివారం జరిగిన సెమీఫైనల్లో థాయిలాండ్ క్రీడాకారిణి రాక్షత్ను 4-1 తేడాతో ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ విజయంతో ఆరో సీడ్ మంజు కనీసం రజత పతకం ఖాయం చేసుకుంది. మరోవైపు పసిడికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఛాంపియన్షిప్ తొలిసారి ఆడుతున్న మంజు రాణి.. గత 18 ఏళ్లలో ఫైనల్స్లో ప్రవేశించిన తొలి భారతీయ మహిళా బాక్సర్గా నిలిచింది.
హరియాణాకు చెందిన మంజురాణి క్వార్టర్స్లో ఉత్తరకొరియా బాక్సర్ను ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. ఈ ఏడాది బల్గేరియాలో జరిగిన స్ట్రాండ్జ మెమొరియల్ బాక్సింగ్ పోటీల్లో ఆమె రజత పతకం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. భారత మరో బాక్సర్ జమునా బోరో 54 కేజీల విభాగం సెమీఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి చేతిలో 0-5తేడాతో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.
భారత సీనియర్ స్టార్ బాక్సర్ మేరీకోమ్ కూడా సెమీస్లో ఓడిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన మహిళల 51 కిలోల కేటగిరీ సెమీస్ బౌట్లో మేరీకోమ్ ఓటమి పాలైంది. టర్కీకి చెందిన బుసెనాజ్ కాకిరోగ్లు చేతిలో మేరీ 4-1 తేడాతో ఓడిపోయింది. వరల్డ్ చాంపియన్షిప్లో మేరీకోమ్ తొలిసారి 51 కిలోల కేటగిరీలో పోటీపడిన విషయం తెలిసిందే. వరల్డ్ మహిళల బాక్సింగ్ చాంపియన్షిప్లో 8 పతకాలు సొంతం చేసుకున్న బాక్సర్గా మేరీ రికార్డు సృష్టించింది.
స్వర్ణ పతకం గెలిచే అవకాశం చేజారినా.. మేరీకోమ్ మాత్రం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు వరల్డ్ బాక్సింగ్ ఈవెంట్లో పురుషులు లేదా మహిళలు ఎవరూ 8 పతకాలు గెలవలేదు. వరల్డ్ ఈవెంట్లో ఇప్పటివరకు ఆరు స్వర్ణాలు, ఓ రజతం, ఓ కాంస్యం మేరీ ఖాతాలో ఉన్నాయి.