
హైదరాబాద్: ఓటమెరుగని యోధుడిలా దూసుకుపోతున్న బాక్సింగ్ కింగ్ విజేందర్ సింగ్ అముజూతో పోటీ పడనున్నాడు. డిసెంబరు 23 శనివారం జరగనున్న ఈ మ్యాచ్ లో ప్రత్యర్థని తక్కువ అంచనా వేయనంటూ అభిప్రాయపడ్డాడు. ప్రొఫెషనల్ కెరీర్లో ఇప్పటిదాకా విజేందర్ తొమ్మిది బౌట్లు ఆడాడు. అన్నింట్లోనూ గెలిచి తన స్థాయిని పెంచుకున్నాడు.
విజేందర్ స్వదేశంలో డబ్ల్యూబీఓ ఆసియా పసిఫిక్ టైటిల్ కోసం ఆఫ్రికా ఛాంపియన్ ఎర్నెస్ట్ అముజు (ఘనా)తో తలపడనున్నాడు. ఈ నేపథ్యంలో విజేందర్ మాట్లాడుతూ.. 'ఒక్క మంచి పంచ్ చాలు.. ఫలితం ఏంటో తేలిపోవడానికి. తక్కువ ర్యాంకు బాక్సర్లు.. ఎంతో మెరుగైన ర్యాంకుల్లో ఉన్న ప్రత్యర్థుల్ని ఓడించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి ఈ పోరును నేను తేలిగ్గా తీసుకోవట్లేదు.' అన్నాడు.
ఎర్నెస్ట్ అముజూ మాట్లాడుతూ.. 'నేను బాక్సింగ్ గ్లౌజులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడేవాడ్ని. ఆ పరిస్థితుల్లో నాకు సాయం చేసిన స్నేహితులు భారతీయులే. కాబట్టి నేను ఇక్కడ ఆడటాన్ని పొరుగుదేశంలో ఆడుతున్నట్లుగా భావించను. విజేందర్ ఒక్కడే సొంత దేశంలో ఆడట్లేదు నేను కూడా' అని పేర్కొన్నాడు.
ఇంకా, మ్యాచ్ గెలవాలంటే ప్రత్యర్థి బలం, అతని అనుభవం అంచనా వేయనవసర్లేదు. కాలం కలిసిరాకపోతే ఎంత బలమైన, అనుభవమున్న ప్రత్యర్థి అయినా బోర్లాపడాల్సిందే. అని వ్యాఖ్యానించాడు. శనివారం జరగనున్న ఈ మ్యాచ్లో గెలవాలన్న పట్టుదల ఇద్దరూ కనబరుస్తూ చాలా సార్లు వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.