భారత దిగ్గజ బాక్సర్, ఒలింపిక్ విజేత మేరీ కోమ్ దాంపత్య జీవితం ఇప్పుడు వీధిన పడింది. గత కొన్ని రోజులుగా మేరీ కోమ్ తన భర్త ఓన్లర్ కోమ్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓన్లర్ ఈ ఆరోపణలను తిప్పికొట్టడమే కాకుండా, మేరీ కోమ్ వ్యక్తిగత జీవితం గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
వివాహేతర సంబంధాల ఆరోపణలు
మేరీ కోమ్ తనను మోసం చేసిందని, పెళ్లయిన తర్వాత కూడా ఆమెకు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఓన్లర్ ఆరోపించారు. 2013లో మేరీ కోమ్ ఒక జూనియర్ బాక్సర్తో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓన్లర్ పేర్కొన్నారు. దీనివల్ల అప్పట్లో తమ మధ్య పెద్ద గొడవ జరిగిందని, ఆ తర్వాత సర్దుకున్నామని చెప్పారు. తిరిగి 2017లో తన అకాడమీకి చెందిన మరో వ్యక్తితో ఆమె సంబంధాన్ని కొనసాగించిందని ఓన్లర్ వెల్లడించారు. దీనికి సంబంధించి తన దగ్గర వాట్సాప్ చాట్స్, పక్కా ఆధారాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

"మేరీ కోమ్ మద్యం తాగుతుంది, గుట్కా తింటుంది"
మేరీ కోమ్ తనపై చేసిన ఆర్థిక మోసం ఆరోపణలను ఓన్లర్ ఖండించారు. "నేను రూ. 5 కోట్లు దొంగిలించానని ఆమె అంటోంది. నా బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోవచ్చు. నిందలు వేయడం కాదు, ఆధారాలు చూపించాలి" అని సవాల్ విసిరారు. అంతేకాకుండా మేరీ కోమ్ అలవాట్ల గురించి మాట్లాడుతూ.. "నేను మద్యం తాగుతానని ఆమె అంటోంది, కానీ ఆమె కూడా వోడ్కా, రమ్ తాగుతుంది. ఆమెకు గుట్కా తినే అలవాటు కూడా ఉంది. ఈ విషయాలు నేను ఎప్పుడూ మీడియాకు చెప్పలేదు" అని ఓన్లర్ వ్యాఖ్యానించారు.
పిల్లల కోసం కోర్టుకు వెళ్లడం లేదు..
తమకు ఇప్పటికే గిరిజన ఆచారాల ప్రకారం విడాకులు అయ్యాయని.. కానీ ఇంకా కోర్టు ప్రక్రియ పూర్తి కాలేదని ఓన్లర్ తెలిపారు. "నేను నా పిల్లలను ప్రేమిస్తున్నాను. వారి భవిష్యత్తు కోసం నేను కోర్టులో పోరాడాలని అనుకోవడం లేదు. కానీ నేషనల్ మీడియా ముందు నాపై అబద్ధపు ఆరోపణలు చేయడం సరికాదు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2022 కామన్వెల్త్ గేమ్స్ సమయంలో మేరీ కోమ్ గాయపడినా ముంబైకి వెళ్లి మరో వ్యక్తితో సమయం గడిపిందని ఆయన ఆరోపించారు.