ఢిల్లీలో జరుగుతునన జాతీయ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ వేదికగా బుధవారం నాడు అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. క్రీడాకారుల అద్భుత ప్రదర్శన కంటే వివాదాలే ఎక్కువగా వార్తల్లో నిలిచాయి. ముఖ్యంగా రింగ్లో క్రమశిక్షణారాహిత్యం, రెఫరీల నిర్ణయాలు ఈ క్రీడా టోర్నమెంట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
రింగ్లో అమానుషం.. ప్రత్యర్థి భుజంపై కరిచివేత
పురుషుల బాక్సింగ్ పోటీల్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకు చెందిన ఇష్మీత్, ఆలిండియా పోలీస్కు చెందిన మోహిత్ మధ్య జరిగిన మ్యాచ్లో క్రీడా స్ఫూర్తి మంటగలిసింది. రెండో రౌండ్ సమయంలో మోహిత్ తన భుజంపై పదే పదే పళ్లతో కరిచాడని ఇష్మీత్ ఆరోపించారు. సాధారణంగా బాక్సింగ్ వంటి క్రీడల్లో ఇలాంటి ప్రవర్తనను క్షమించరాని నేరంగా పరిగణిస్తారు. ఇష్మీత్ తన భుజంపై పడిన గాయాలను రెఫరీకి చూపించినప్పటికీ, మ్యాచ్ను నిలిపివేయకపోవడం గమనార్హం. ఇలాంటి చర్యలకు బాక్సర్ను తక్షణమే అనర్హుడిగా ప్రకటించాల్సి ఉన్నా, రెఫరీ మ్యాచ్ను కొనసాగించనివ్వడంపై రైల్వే కోచ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా టెక్నికల్ టీమ్ దీనిపై తుది విచారణ జరుపుతోంది.

రింగ్లోకి కోచ్ల ఎంట్రీ.. నిలిచిపోయిన పోరు
మరోవైపు 55 కేజీల విభాగంలో సర్వీసెస్ బాక్సర్ పవన్ బార్త్వాల్, ఆలిండియా పోలీస్ బాక్సర్ లలిత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ రసాభాసగా మారింది. పాయింట్ల కేటాయింపు విషయంలో అసంతృప్తి చెందిన ఆలిండియా పోలీస్ కోచ్లు, సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా నేరుగా రింగ్లోకి దూసుకెళ్లారు. దీనివల్ల రింగ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆట కాసేపు నిలిచిపోయింది. హంగామా తగ్గిన తర్వాత అధికారులు నిబంధనల ప్రకారం మూడో రౌండ్ కోసం లలిత్ను రింగ్లోకి రావాలని కోరారు. అయితే అతను నిర్ణీత సమయానికి రిపోర్ట్ చేయకపోవడంతో పవన్ను విజేతగా ప్రకటించారు. ఈ ఘటనపై బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) సీరియస్గా స్పందించి సమగ్ర నివేదిక కోరింది.
నిఖత్ జరీన్, అమిత్ పంగల్ ఘన విజయం
ఓ వైపు వివాదాలు రాజ్యమేలుతున్నా.. మరోవైపు స్టార్ బాక్సర్లు తమ పంచ్లతో మెరిశారు. తెలంగాణ బిడ్డ, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (51kg) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లడఖ్కు చెందిన కుల్సుమా బానోతో జరిగిన పోరులో నిఖత్ కేవలం రెండు నిమిషాల్లోనే విజయం సాధించింది. ప్రత్యర్థిపై నిఖత్ విసిరిన పంచ్లకు రెఫరీ మ్యాచ్ను నిలిపివేసి నిఖత్ను క్వార్టర్ ఫైనల్ విజేతగా ప్రకటించారు. అలాగే, అమిత్ పంగల్ 4-1 తేడాతో కృష్ణపాల్పై విజయం సాధించి తదుపరి రౌండ్కు చేరుకున్నారు. మీనాక్షి హుడా కూడా జార్ఖండ్ బాక్సర్పై ఏకగ్రీవ నిర్ణయంతో గెలిచి తన సత్తా చాటింది.
క్రమశిక్షణపై చర్చ
ఈ జాతీయ ఛాంపియన్షిప్లో వెలుగుచూసిన ఘటనలు బాక్సింగ్ వంటి క్రీడల్లో క్రమశిక్షణ ఎంత అవసరమో గుర్తుచేస్తున్నాయి. నిఖత్ జరీన్ వంటి క్రీడాకారులు తమ ప్రతిభతో గర్వకారణంగా నిలుస్తుంటే.. కొందరు బాక్సర్లు, కోచ్లు చేసిన పనులు క్రీడకు మచ్చ తెచ్చాయి. రెఫరీల నిర్లక్ష్యం కూడా ఈ వివాదాలు ముదిరేందుకు కారణమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని క్రీడా ప్రేమికులు కోరుతున్నారు.