
టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లోవ్లినా బోర్గోహైన్ తనను బీఎఫ్ఐ అధికారులు మానసికంగా వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కోచ్ సంధ్యా గురుంగ్కు కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) విలేజ్లోకి ప్రవేశం నిరాకరించారని స్టార్ బాక్సర్ ఆరోపించగా.. దీనిపై బీఎఫ్ఐ వివరణ ఇచ్చింది. సంధ్యా గురుంగ్కు హోటల్లో డెలిగేట్ అకామడేషన్, ట్రాన్స్ పోర్ట్ కల్పించినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ) సోమవారం స్పష్టం చేసింది. లోవ్లినా ట్విట్టర్లో సుదీర్ఘ ట్వీట్ చేస్తూ బీఎఫ్ఐపై తన అక్కసు వెళ్లగక్కింది.
బీఎఫ్ఐ ఓ ప్రకటనలో స్పందిస్తూ.. సంధ్యా గురుంగ్ ఐర్లాండ్లోని శిక్షణ శిబిరంలో బీఎఫ్ఐ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం బీఎఫ్ఐ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్తో కలిసి మ్యూచువల్ శిక్షణ క్యాంపులను జరుపుతుంది. సంధ్యా గురుంగ్ బర్మింగ్హామ్లోని స్క్వాడ్లో భాగమవుతుంది. ఈలోగా ఆమెకు హోటల్లో వసతితో పాటు సరైన ట్రాన్స్ పోర్ట్ కూడా కల్పిస్తున్నాం' అని బీఎఫ్ఐ తన ప్రకటనలో వెల్లడించింది.
బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్లో కంటెంజెంట్కు సహాయక సిబ్బంది విషయంలో పరిమితులున్నాయనే విషయాన్ని కూడా బీఎఫ్ఐ ప్రస్తావించింది. 'ఆటగాళ్ల బృందానికి కేవలం 33శాతం అంటే 1/3 మంది మాత్రమే సహాయక సిబ్బందిగా అనుమతించబడతారు. కామన్ వెల్త్ గేమ్స్లో 12మంది బాక్సర్లు పాల్గొంటుండగా.. వారికి కోచ్ లతో సహా కేవలం నలుగురు సహాయక సిబ్బంది మాత్రమే ఉండాలి. అయితే కోచ్లు, సహాయక సిబ్బందికి సంబంధించి బాక్సింగ్ క్రీడలో అవసరాలు కొద్దిగా భిన్నంగా ఉంటాయనే విషయాన్ని కూడా ఒలింపిక్ అసోషియేషన్ చెంతకు తీసుకెళ్లాం. అనేక బౌట్లు ఉన్నందున అదనపు సహాయక సిబ్బంది అవసరాన్ని ప్రస్తావించాం. అందువల్ల మొత్తం 12మంది బాక్సర్ల బృందానికి సహాయక సిబ్బంది సంఖ్య 4 నుండి 8కి పెరిగింది.' అని బీఎఫ్ఐ తెలిపింది.