
ఉలాన్బాటర్ (మంగోలియా): ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు సత్తా చాటారు. ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 12 పతకాలు సాధించి సత్తా చాటారు. ఆదివారం జరిగిన మహిళల విభాగంలో బరిలో నిలిచిన ఐదుగురు బాక్సర్లు పసిడి పతకాలతో సత్తా చాటగా.. పురుషుల విభాగంలో ఇద్దరు బాక్సర్లు తుది పోరులో ఓడి రజతాలతో సరిపెట్టుకున్నారు.
మహిళల ఫైనల్స్లో పూనమ్ (54 కేజీలు) వికి కాయ్ (చైనా)పై, సుష్మా (81 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బకీత్జాన్కిజీపై, నోరెమ్ చాను (51 కేజీలు) అనెల్ బార్కీపై (కజకిస్తాన్)పై, వింకా (64 కేజీలు) హైని నులాతైయాలి (చైనా)పై, సనమచ చాను (75 కేజీలు) నవ్బఖోర్ ఖమిదోవ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించి పసిడి పతకాలు సాధించారు.
పురుషుల ఫైనల్స్లో సెలాయ్ సోయ్ (49 కేజీలు) కజకిస్తాన్ బాక్సర్ బజార్బే ఉల్లూ ముఖమెద్సైఫీ చేతిలో, అంకిత్ నర్వాల్ (60 కేజీలు) జపాన్ బాక్సర్ రెటో త్సుత్సుమె చేతిలో ఓడి రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. వీరితో పాటు అరుంధతీ చౌదరి (69 కేజీలు), కోమల్ప్రీత్ కౌర్ ( ప్లస్ 81 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సతేందర్ సింగ్ (91 కేజీలు), అమన్ (91+ కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. మొత్తం 12 పతకాలతో భారత బాక్సర్లు టోర్నీని ఘనంగా ముగించారు.