
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలోకి మరో పతకం వచ్చింది. బాక్సింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం పురుషుల 75 కేజీల సెమీఫైనల్ బౌట్ జరగాల్సి ఉంది.
అయితే, గత రౌండ్లలో తలపడిన భారత బాక్సర్ వికాస్ కృష్ణన్ గాయం కారణంగా ఈ సెమీ ఫైనల్ బౌట్ నుంచి తప్పుకున్నాడు. దీంతో అతడు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గేమ్స్లో భాగంగా వికాస్ కృష్ణన్ గత రౌండ్లలో తీవ్రంగా గాయపడ్డాడు.
దీంతో అతడిని పరీక్షించిన వైద్యులు సెమీఫైనల్ బౌట్కు అనర్హుడని తేల్చారు. దీంతో సెమీఫైనల్ బౌట్ నుంచి వికాస్ కృష్ణన్ తప్పుకున్నట్లు ఆసియా గేమ్స్లో భారత అధికారులు స్పష్టం చేశారు. సెమీపైనల్ బౌట్లో వికాస్ కృష్ణన్ కజకిస్థాన్కు చెందిన అమన్కుల్ అబిల్ఖాన్తో తలపడాల్సి ఉంది.
సెమీఫైనల్ బౌట్లో గనుక గెలిస్తే స్వర్ణం కోసం ఫైనల్లో తలపడేవాడు. అయినప్పటికీ, వికాస్ కృష్ణన్ చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు ఆసియా గేమ్స్లో పతకాలు సాధించిన భారత తొలి బాక్సర్గా వికాస్ కృష్ణన్ అరుదైన ఘనత సాధించాడు.
2010లో 60 కేజీలో విభాగంలో స్వర్ణం, 2014లో మిడిల్ వెయిట్లో కాంస్య పతకాలను నెగ్గిన వికాస్ కృష్ణన్ తాజా ఆసియా గేమ్స్లో కాంస్య పతకం నెగ్గాడు. ప్రీ క్వార్టర్ బౌట్లో వికాస్ కృష్ణన్ గాయపడగా, చైనాకు చెందిన తోహితా ఎర్బికా తంగ్లాథాన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ బౌట్లో మరింత పెద్దది అయింది.
గాయంతో రక్తం ఓడుతున్నప్పటికీ తాను సెమీఫైనల్ బౌట్కు ఫిట్గానే ఉన్నట్లు వికాస్ కృష్ణన్ ప్రకటించినా టీమ్ డాక్టర్లు మాత్రం అతడు ఫిట్గా లేడని చెప్పడంతో సెమీ ఫైనల్ బౌట్ నుంచి తప్పుకున్నాడు. తాజా పతకంతో భారత్ పతకాల సంఖ్య 59కి చేరింది. ఇందులో 13 స్వర్ణం, 21 రజతం, 25 కాంస్య పతకాలు ఉన్నాయి.