
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా ఇటీవలే ముగిసిన ఆసియా గేమ్స్లో 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై బాక్సింగ్ ఈవెంట్లో స్వర్ణం సాధించిన బాక్సర్ అమిత్ పంగల్ను 'అర్జున' అవార్డు కోసం భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) నామినేట్ చేసింది.
టోర్నీలో భాగంగా 49 కేజీల లైట్ వెయిట్ ఫ్లై బాక్సింగ్ ఈవెంట్లో రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత, ఉజకిస్థాన్ బాక్సర్ హసన్బాయ్ దస్మోస్తవ్ను 3-2 తేడాతో అమిత్ పంగల్ చిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఆసియా గేమ్స్లో స్వర్ణం సాధించి ఏకైక భారత బాక్సర్గా అమిత్ పంగల్ చరిత్ర సృష్టించాడు.
దీంతో అమిత్ను అర్జున అవార్డుకి నామినేట్ చేసినట్లు బీఎఫ్ఐ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మరోవైపు బాక్సర్లు సోనియా లాథర్, గౌరవ్ బిధూరిల పేర్లను కూడా బీఎఫ్ఐ నామినేట్ చేసింది. తన పేరుని అర్జున అవార్డుకి సిఫారసు చేయడంపై 22 ఏళ్ల అమిత్ తన నామినేషన్పై సంతోషం వ్యక్తం చేశాడు.
"నా పేరు నామినేట్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. దీనిపై నాకంటే నా పతకమే బాగా మాట్లాడుతుంది" అని చెప్పాడు. హర్యానాకు చెందిన అమిత్ ఈ ఏడాది జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రజతం సాధించాడు. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత బాక్సర్లు పసిడి పతకం నెగ్గడంలో విఫలమైనా అమిత్ పంగల్ ఆ లోటును తీర్చాడు.
ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో బాక్సింగ్ ఈవెంట్లలో భారత్కు దక్కిన తొలి బంగారు పతకం ఇదే కావడం విశేషం. ఈ గేమ్స్లో బాక్సింగ్లో భారత్కు మొత్తం రెండు పతకాలు వచ్చాయి. పురుషుల 75 కేజీల ఈవెంట్లో వికాస్ యాదవ్ కాంస్యం నెగ్గగా.. అమిత్ పంగల్ స్వర్ణం పతకం సాధించాడు.