
న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై నిలకడగా రాణిస్తున్న భారత బాక్సర్లు ర్యాంకింగ్స్లోనూ సత్తాచాటారు. అమెచ్యూర్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా) 18 నెలల తర్వాత సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత యువ బాక్సర్ అమిత్ పంగల్ (52 కిలోలు) నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. జకార్తా-2018 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన ఈ హరియాణా బాక్సర్ ఖాతాలో 1300 పాయింట్లు ఉన్నాయి.
అమిత్ పంగల్ చిరకాల ప్రత్యర్థి ప్రస్తుత ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ జైరోవ్ షకోబిదిన్ (ఉజ్బెకిస్తాన్) 1200 పాయింట్లతో రెండో ర్యాంక్కు పడిపోగా.. అసెనోవ్ పనేవ్ (బల్గేరియా) 1000 పాయింట్లతో మూడో ర్యాంక్లో ఉన్నాడు. బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో పతకంతో మెరిసిన అమిత్.. కెరీర్లో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2018 నుంచి పంగల్.. విజయవంతమైన భారత బాక్సర్గా కొనసాగుతున్నాడు. 24 ఏళ్ల అమిత్ రెండేళ్లుగా భారత స్టార్ బాక్సర్గా రూపాంతరం చెందాడు. అతను 2018 కామన్వెల్త్ గేమ్స్లో రజతం, ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఆసియా చాంపియన్షిప్లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్షిప్లో రజతం సాధించాడు.
మొత్తం తొమ్మిది వెయిట్ కేటగిరీలకుగాను నాలుగింటిలో భారత బాక్సర్లు టాప్-10లో ఉన్నారు. కవీందర్ బిష్త్ (56 కేజీలు) నాలుగో ర్యాంక్లో నిలవగా.. దీపక్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (64 కేజీలు) ఆరో ర్యాంక్లో నిలిచారు. గత ఏడాది జనవరిలో 'ఐబా' ప్రకటించిన ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్లో ఉన్న భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు) తాజా ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి పడిపోయింది.
మహిళల విభాగంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ 51 కేజీల విభాగంలో మూడో ర్యాంక్ దక్కించుకోగా.. అదే కేటగిరీలో పోటీ పడుతున్న తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ 21వ ర్యాంక్లో నిలిచింది. 48 కేజీల విభాగంలో మంజురాణి రెండో ర్యాంక్ దక్కించుకోగా.. 69 కేజీల కేటగిరీలో లవ్లీనా బొర్గొహైన్ మూడో ర్యాంక్లో నిలిచింది.