హైదరాబాద్: మురికి వాడల నుంచి వచ్చిన బాక్సర్లే ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించారని హెవీవెయిట్ బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ అన్నాడు. ముంబైలో శుక్రవారం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కుమిటె లీగ్ తొలి సీజన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మైక్ టైసన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
"ఎంత పేదరికంలో నుంచి వస్తే అంతకుమించిన మంచి బాక్సర్ అవుతాడు. మురికివాడల నుంచి వచ్చిన ప్రతి బాక్సింగ్ యోధుడు అద్భుత విజయాలు నమోదు చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం బాక్సింగ్ ప్రపంచంలోని పోరాటయోధులంతా మురికివాడల నుంచి వచ్చినవారే" అని మైక్ టైసన్ అన్నాడు.
"నేను కూడా మురికివాడకు చెందిన వాడినే. అక్కడే పెరిగి పెద్దయ్యాను. అయితే, ఎప్పటికైనా అక్కడి నుంచి బయటికి రావాలనుకున్నా. కాబట్టే ఇప్పుడు ఇక్కడున్నా. కష్టపడిన వాళ్లందరూ మురికి వాడల నుంచి బయటపడతారు. ఒక లక్ష్యంగా ముందుకు సాగి విజయవంతమయ్యానని, బాక్సర్గా విజయాలతో మీముందు మాట్లాడగలుగుతున్నా" అని అన్నాడు.
"తొలిసారి భారత్ వచ్చిన తనకు ఇక్కడ టోర్నీని ఆరంభించడం సంతోషాన్ని కలిగిస్తుందని .. యూఏఈ, భారత్ మధ్య జరిగే పోటీలో నైపుణ్యాలున్న జట్టునే విజయం వరిస్తుంది" అని టైసన్ అన్నాడు. 52 ఏళ్ల టైసన్ బాక్సింగ్లో ఎంత విజయవంతమయ్యాడో వ్యక్తిగతంగా అంత చెడ్డపేరు తెచ్చిపెట్టుకున్నాడు. కెరీర్లో మైక్ టైసన్ 50 విజయాలు సాధించగా.. అందులో 44 నాకౌట్ విజయాలు కావడం విశేషం.