
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా గేమ్స్లో భారత్కు బాక్సింగ్లో రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం పురుషుల 49 కేజీల లైట్ ఫ్లై విభాగంలో జరిగిన క్వార్టర్స్లో భారత ఆటగాడు అమిత్ పంగల్... దక్షిణ కొరియా ఆటగాడు కిమ్ జంగ్ యాంగ్పై విజయం సాధించి సెమీస్లోకి అడుగుపెట్టాడు.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
దీంతో అమిత్ పతకం ఖాయం చేసుకున్నాడు. ఆ తర్వాత 75 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్స్లో 3-2తో చైనా క్రీడాకారుడిపై విజయం సాధించి సెమీఫైనల్ చేరడంతో వికాస్కు కనీసం కాంస్యం ఖాయమైంది. పురుషుల బాక్సింగ్లో భారత్కు ఇది రెండో పతకం కావడం విశేషం.
ఆసియా గేమ్స్లో వికాస్ కృష్ణన్ వరుసగా మూడోసారి పతకం గెలిచినట్లైంది. ఈ మ్యాచ్ మధ్యలో వికాస్ కంటికి గాయమైంది. అయినప్పటికీ నొప్పి భరిస్తూ ఆడి విజయం సాధించాడు. 2010 ఆసియా క్రీడల్లో బంగారు పతకం నెగ్గిన వికాస్... 2014లో కాంస్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే.
పతకం లేకుండానే ఇంటికి భారత మహిళా బాక్సర్లు
మహిళల బాక్సింగ్లో అమ్మాయిల కథ ముగిసింది. ఒక్క పతకం కూడా గెలవకుండానే అమ్మాయిలు వెనుదిరిగారు. 2010 నుంచి ఆసియా గేమ్స్లో బాక్సింగ్ను చేర్చినప్పటి నుంచి మహిళల విభాగంలో భారత్ పతకం గెలవకుండా రావడం ఇదే తొలిసారి. బుధవారం పోటీలు ప్రారంభమయ్యే నాటికి భారత్ తరఫున బాక్సింగ్లో మహిళల విభాగంలో నిలిచిన ఏకైక క్రీడాకారిణి సర్జుబాల దేవి.
51 కేజీల విభాగంలో క్వార్టర్స్ చేరిన సర్జుబాల దేవి పతకం సాధిస్తోందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ఆమె క్వార్టర్స్లో చైనాకు చెందిన చాంగ్ యువాన్ చేతిలో 0-5 తేడాతో ఓడిపోయింది. ఆసియా గేమ్స్లో బాక్సింగ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి మహిళల విభాగంలో భారత్ పతకం లేకుండా వెనుదిరగడం ఇదే తొలిసారి అయింది.
ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మొత్తం 53 పతకాలు ఉన్నాయి. ఇందులో 10 స్వర్ణాలు, 20 రజతాలు, 23 కాంస్యాలు ఉన్నాయి. 216 పతకాలతో చైనా పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
స్క్వాష్లో భారత్కు మరో పతకం ఖాయం
ఆసియా గేమ్స్లో భారత్కు మరో పతకం ఖాయమైంది. మహిళల స్క్వాష్ జట్టు సెమీ ఫైనల్కు చేరుకుంది. జోష్న చినప్ప, దీపికా పల్లికల్, సునయనా కురువిల్లా, తన్వీ ఖన్నాతో కూడిన భారత జట్టు 3-0తో చైనాను ఓడించింది. భారత్ గురువారం పూల్-బిలో చివరి మ్యాచ్ను హాంకాంగ్తో తలపడనుంది. ఇరాన్, థాయ్లాండ్, ఇండోనేషియాను ఓడించి భారత్ సెమీస్ చేరుకుంది. ఇంచియాన్లో 2014లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళలు రజతం పతకం గెలిచిన సంగతి తెలిసిందే.