
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో భాగంగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు ముంబై రాకెట్స్ను మైనస్ పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. లక్నోలోని బాబు బనారసి దాస్ బ్యాడ్మింటన్ అకాడమీలో సోమవారం జరిగిన పోరులో బెంగళూరు బ్లాస్టర్స్ 6- (-1) తేడాతో ముంబైపై అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
మిక్స్డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, సింగిల్స్ ఇలా ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ బెంగళూరు బ్లాస్టర్స్ జట్టు ఆటగాళ్లు విజయం సాధించారు. మొదట జరిగిన మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి-కిమ్ సా రంగ్ జోడి 15-8, 10-15, 15-10 పాయింట్ల తేడాతో అర్జున్-గ్యాబ్రియెలా స్టొయెవా (ముంబై)పై నెగ్గింది.
ఆ తర్వాత జరిగిన మహిళల సింగిల్స్లో గిల్ మౌర్ 15-14, 15-8తో బైవన్ జంగ్పై, పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్వన్ అక్సెల్సెన్ 15-6, 15-3తో సాన్వాన్ హోపై, మరో పురుషుల సింగిల్స్లో చాంగ్వీ ఫెంగ్ 9-15, 15-8, 15-6తో సమీర్వర్మపై విజయం సాధించారు.
చివరి పురుషుల డబుల్స్లో మథియాస్ బోయె-కిమ్ సా రంగ్ జోడీ 9-15, 15-10, 15-14తో లీ యంగ్ డే-బూన్ హియోంగ్ తన్ (ముంబై) జోడీపై నెగ్గింది. దీంతో ట్రంప్ మ్యాచ్లుగా సాగిన రెండు పురుషుల సింగిల్స్తో సహా, మిగతా మ్యాచుల్లోనూ ముంబై ఓటమిపాలైంది. మంగళవారం జరిగే పోరులో అవధ్ వారియర్స్తో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ తలపడనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.