హైదరాబాద్: గ్లాస్గో వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న వరల్డ్ ఛాంపియన్షిప్కు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. క్రికెట్లో వరల్డ్కప్కు ఎంతటి ప్రాధాన్యం ఉంటుందో బ్యాడ్మింటన్లో వరల్డ్ చాంపియన్షిప్స్కూ అంతే క్రేజ్ ఉంటుంది.
ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులు ఈ వరల్డ్ చాంపియన్షిప్స్లో పోటీ పడతారు. నాలుగు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న ఈ టోర్నీలో భారత్ ఇప్పటిదాకా ఐదు పతకాలే నెగ్గడం విశేషం. దీనిని బట్టి ఈ టోర్నీ సత్తా ఏంటో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది.

ఈ మధ్య కాలంలో భారత షట్లర్లు అంతర్జాతీయ ఈవెంట్లలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అంతేనా... భారత బ్యాడ్మింటన్పై ప్రపంచం మొత్తం దృష్టి సారించేలా చేశారు. ఈసారి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్స్నకు భారత్ నుంచి 21 మంది బరిలోకి దిగుతున్నారు.
ఈ మెగా టోర్నీకి ఇంత పెద్ద సంఖ్యలో షట్లర్లు అర్హత సాధించడం ఇదే తొలిసారి. అలాగే (పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్) విభాగాల్లో క్వాలిఫై అయిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. కిడాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్, అజయ్ జయరామ్, సమీర్ వర్మ వరల్డ్ చాంపియన్షిప్స్ అర్హత సాధించారు.
ఇక మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, రితుపర్ణదాస్, తన్వీలాడ్ బరిలో ఉన్నారు. 2011లో జరిగిన ఈ టోర్నీలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప డబుల్స్లో కాంస్యం గెలిచారు. ఆ తర్వాత ప్రతీసారి భారత్ పతకం నెగ్గుతూనే వస్తోంది. 2013, 2014లో పీవీ సింధు కంచు కాంస్యం సాధించగా, 2015లో సైనా నెహ్వాల్ రజతంతో మెరిసింది.
వరల్డ్ చాంపియన్షిప్స్లో వరుస పతకాల తర్వాత సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజతంతో చరిత్ర సృష్టించింది. ఇక, ఈ ఏడాది ఆరంభంలోనే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సిరీస్ గెలిచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్కు దూసుకెళ్లింది. చివరకు ఐదో ర్యాంక్తో ఈ చాంపియన్షిప్స్ బరిలో దిగనుంది.
ఇక సైనా ప్రస్తుతం ఫామ్లో లేదు.ప్రస్తుతం 16వ ర్యాంక్లో ఉన్న ఆమెకు మళ్లీ టాప్ క్లాస్ క్రీడాకారిణిగా నిరూపించేందుకు ఇదే మంచి సరైన సమయం. ఇక ఈ టోర్నీకి అర్హత సాధించిన యువ ప్లేయర్లు రితుపర్ణ దాస్, తన్వీలాడ్ 46, 93 ర్యాంక్ల్లో కొనసాగుతున్నారు. దీంతో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా, సింధుపైనే ఎక్కువగా ఆశలు ఉన్నాయి.
ఇక పురుషుల విషయానికి వస్తే ఈ ఏడాది అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ సీజన్లో పురుష షట్లర్లు మూడు గ్రాండ్ప్రీ టోర్నమెంట్లతో సహా ఏకంగా ఆరు టైటిళ్లు సాధించారు. ఇందులో రెండు సూపర్ సిరీస్లు ఉన్నాయి. మూడు అంతర్జాతీయ టోర్నీ ఫైనల్స్ల్లో భారత ఆటగాళ్లు పోటీ పడ్డారు.
రియో తర్వాత నిలకడ తప్పిన కిడాంబి శ్రీకాంత్.. వెంటవెంటనే రెండు టైటిళ్లతో మళ్లీ తన ఫామ్ని అందిపుచ్చుుకున్నాడు. ఒకానొక దశలో 31వ ర్యాంక్కు పడిపోయిన శ్రీకాంత్ అద్భుత ఆటతీరుతో మళ్లీ టాప్-10లోకి దూసుకొచ్చాడు. మరో తెలుగు తేజం సాయి ప్రణీత్కు కూడా ఈ సీజన్ బాగా కలిసొచ్చింది.
రెండు ట్రోఫీలతో సత్తా చాటాడు. థాయ్లాండ్ ఓపెన్ నెగ్గిన తర్వాత 19వ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఇక, అజయ్ జయరాం సీజన్ మొత్తం నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం టాప్-20లో కొనసాగుతున్నాడు. సమీర్ వర్మ టాప్-30లో కొనసాగుతున్నాడు.
1983లో దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకోణె కాంస్యం నెగ్గిన తర్వాత పురుషుల విభాగం నుంచి ఇప్పటిదాకా భారత్కు పతకం రాలేదు. 25 ఏళ్ల పతక నిరీక్షణకు ఈసారైనా మన షట్లర్లు ముగింపు పలుకుతారో లేదో చూడాలంటే ఒక వారం రోజులు ఆగాల్సిందే.