కిరణ్ రిజిజును కలిసిన సింధు:
అనంతరం మంగళవారం ఉదయం సింధు, కోచ్ గోపీచంద్ కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో బంగారు పతకం సాధించిన సింధును రిజిజు అభినందించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన అనంతరం సింధు, గోపీచందర్ హైదరాబాద్కు చేరుకోనున్నారు.
సింధు చరిత్ర:
ఆదివారం జరిగిన ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (బీడబ్ల్యూఎఫ్) మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది.
బాయ్ నజరానా:
ప్రపంచ చాంపియన్గా అవతరించిన పీవీ సింధుకు బాయ్ రూ. 20 లక్షలు నగదు పురస్కారం అందజేయనున్నట్లు ఆదివారం ప్రకటించింది. 36 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్లో కాంస్య పతకం సాధించిన సాయి ప్రణీత్కు రూ. 5 లక్షలు నగదు బహుమతి ఇస్తామని బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వశర్మ ప్రకటించారు. చాంపియన్లో భారత ఆటగాళ్లు పతకాలు సాధించడం దేశానికి గర్వ కారణం అని బిశ్వశర్మ అన్నారు.
జాంగ్ నింగ్ రికార్డు సమం:
ప్రపంచ చాంపియన్గా నిలిచిన సింధుకు 13 వేల ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రపంచ చాంపియన్షిప్లో విజేతలకు ఎలాంటి ప్రైజ్మనీ లేదు. విజేతలకు కేవలం పతకాలు మాత్రమే అందజేస్తారు. ఈ విజయంతో ఒకుహారాపై ముఖాముఖి రికార్డులో సింధు ఆధిక్యాన్ని 9-7కు పెంచుకుంది. ఇక 42 ఏళ్ల ప్రపంచ చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్గా చైనా క్రీడాకారిణి జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉన్న రికార్డును సింధు (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) సమం చేసింది.