అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు కలిశారు. శుక్రవారం సింధు తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయంలో జగన్ను కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించిన సింధును శాలువా కప్పి జగన్ సత్కరించి అభినందలను తెలిపారు. ఒక తెలుగమ్మాయి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించడం గర్వంగా ఉందని సింధుపై జగన్ ప్రశంసలు గుప్పించారు. వచ్చే ఒలింపిక్స్లో సింధు పతకం సాధించాలని సీఎం ఆకాంక్షించారు. సింధుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
వైరల్ వీడియో.. కోహ్లీని ముద్దాడిన అనుష్క!!
సమావేశం అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ... 'విశాఖలో అకాడమీని నెలకొల్పేందుకు 5 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారు. ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు' అని వెల్లడించారు. పద్మభూషణ్ పురస్కారానికి తన పేరును పరిశీలిస్తుండటం గర్వంగా ఉందని సింధు ఆనందం వ్యక్తం చేసింది.
అనంతరం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను సింధు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సింధుతో పది నిమిషాలపాటు గవర్నర్ ముచ్చటించారు. అనంతరం సింధును గవర్నర్ సన్మానించారు. మంత్రి అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఇక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో పీవీ సింధును సత్కరించనున్నారు.
మైసూరు దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే యువ దసరా కార్యక్రమంలో పాల్గొనాలని సింధును కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. యువ దసరాను అక్టోబర్ 1న కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇటీవలే జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో పీవీ సింధు స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 21-7, 21-7తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)పై విజయం సాధించింది. సింధు కేవలం 38 నిమిషాల్లో ఒకుహారాను మట్టికరిపించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డుల్లోకి ఎక్కింది.
అమరావతి: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు గౌరవ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. pic.twitter.com/6fVSctff0G
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 13, 2019