
హైదరాబాద్: వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది. కొరియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ నుంచి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు నిష్క్రమించింది. టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో వరల్డ్ చాంపియన్ పీవీ సింధుపై 21-7, 22-24, 15-21తేడాతో 11వ సీడ్ జాంగ్ బీవెన్(అమెరికా) విజయం సాధించింది.
బసిల్ వేదికగా ఇటీవలే ముగిసిన వరల్డ్ ఛాంపియన్షిప్ సెమీపైనల్లో అమెరికాకు చెందిన జాంగ్ బీవెన్పై విజయం సాధించిన పీవీ సిందు పైనల్కు అర్హత సాధించింది. తాజా గెలుపుతో జాంగ్ బీవెన్ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది. కాగా, గత వారంలో జరిగిన చైనా ఓపెన్ ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో సైతం పీవీ సింధు ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
తొలి గేమ్లో సింధు 21-7తో ఆధిపత్యం కనబర్చగా తర్వాతి రెండు గేమ్లను 22-24, 15-21తో బీవెన్ సొంతం చేసుకుంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన తర్వాత పీవీ సింధు ఓడిన రెండో టోర్నీ ఇది. గత వారంలో చైనా ఓపెన్ను పీవీ సింధు చేజార్చుకున్న సంగతి తెలిసిందే. కాగా, 2017లో సింధు కొరియా ఓపెన్ టైటిల్ సాధించింది.
ఇక, పురుషుల సింగిల్స్లో భారత షట్లర్ సాయి ప్రణీత్ ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. టోర్నీలో భాగంగా తన తొలి మ్యాచ్లో సాయి ప్రణీత్ డెన్మార్క్కు చెందిన ఆండెర్స్ ఆంటోన్సేన్తో తలపడ్డాడు. తొలి గేమ్ను 9-21తో కోల్పోయిన సాయి ప్రణీత్ రెండో గేమ్లో 7-11తో వెనుకబడిన సమయంలో ఆట ఆడేందుకు తెగ ఇబ్బంది పడ్డాడు.
దీంతో ఆట మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో ఆండెర్స్ ఆంటోన్సేన్ గెలిచినట్లు అంఫైర్ ప్రకటించాడు. అటు పీవీ సింధుతో పాటు ఇటు సాయి ప్రణీత్ పోరాటం కూడా ముగియడంతో భారత అభిమానులు నిరాశకు గురయ్యారు. కాగా, గతవారంలో జరిగిన చైనా ఓపెన్లో కూడా సాయి ప్రణీత్ క్వార్టర్స్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.