హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పైనల్లో భారత షట్లర్ పీవీ సింధు పోరాడి ఓడింది. జపాన్కు చెందిన నొజోమి ఒకుహరతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు ఓటమి పాలై రజత పతకాన్ని సొంతం చేసుకుంది.

హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఒకుహర విజేతగా నిలిచింది. తొలి గేమ్ను 19-21తో కోల్పోయిన సింధు, రెండో గేమ్ను 22-20 తేడాతో సింధు గెలుచుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్లో 20-22తో సింధు పోరాడి ఓడింది.
వరల్డ్ చాంపియన్షిప్లో సింధుకు ఇదో మూడో పతకం కావడం విశేషం. 2013, 2014 సంవత్సరాల్లో సింధుకు ఇదే టోర్నమెంట్లో కాంస్య పతకం వచ్చింది.
తొలి గేమ్లో ఇలా:
తొలి గేమ్లో ఆరంభం నుంచీ అత్యంత ప్రతిభ కనబరిచిన సింధు తర్వాత కొంచెం వెనుకంజ వేయడంతో 19-21 తేడాతో తొలి గేమ్లో ఓడింది. అయినప్పటికీ.. గేమ్ మాత్రం రసవత్తరంగా సాగింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
రెండో గేమ్లో
మొదటి గేమ్ కంటే రెండో గేమ్ను ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని చూశారు. చివరి వరకు పోరు ఎంతో ఉత్కంఠతో సాగింది. చివరి వరకు జోరులో కొనసాగిన ఒకుహర పై ఒక్కసారిగా సింధు అద్భుత ప్రదర్శన చేసి గెలిచింది.
మూడో గేమ్లో
మూడో గేమ్ ఆది నుంచి సమాన పాయింట్లతో చాలా టఫ్ గానే కొనసాగింది. అయితే... చివరి వరకు చాలా ఉత్కంఠతో కొనసాగిన ఈ గేమ్ చివర్లో సింధు కొంచెం తడబడటంతో బంగారు పతకాన్ని ఒకుహర ఎగరేసుకు పోయింది.
సైనా, సింధుకు రాష్ట్రపతి అభినందనలు
వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో తొలిసారి రెండు పతకాలు సాధించిన భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభినందించారు. వీరిద్దరి విజయాలకు దేశం గర్విస్తోందని రాష్ట్రపతి కోవింద్ అన్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీరి విజయాలను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
వరల్డ్ ఛాంపియన్షిప్లో రజతం సాధించి సింధు, కాంస్యం సాధించిన సైనాకు ప్రోత్సాహకరంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నగదు బహుమతులను ప్రకటించింది. సింధుకు రూ.10లక్షలు, సైనా నెహ్వాల్కు రూ.5లక్షలు అందజేస్తామని బాయ్ అధ్యక్షుడు హిమాంత బి శర్మ తెలిపారు.