హైదరాబాద్: భారత స్టార్ పి.వి.సింధుకు ప్రపంచ ఛాంపియన్షిప్లో కఠినమైన డ్రా ఎదురైంది. మళ్లీ ఒకుహర సవాల్ ఎదుర్కోనుంది. చిరకాల ప్రత్యర్థి, డిఫెండింగ్ ఛాంపియన్ నొజొమి ఒకుహరతో సింధు క్వార్టర్ఫైనల్లో తలపడే అవకాశముంది. ఈనెల 30నుంచి చైనాలో జరిగే ప్రపంచ చాంపియన్షిప్కు ఆటగాళ్ల డ్రాను ప్రకటించారు. గతేడాది ఫైనల్లో సింధును ఒకుహర ఓడించిన సంగతి తెలిసిందే.
దీనికితోడు గతవారం థాయ్లాండ్ ఓపెన్ టైటిల్ పోరులోనూ సింధును ఒకుహర కంగుతినిపించింది. దీంతో ఈసారైనా సింధు ప్రతీకారం తీర్చుకుంటుందేమో చూడాలి. సింధుకు తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో ఫిత్రియాని లేదా జెచిరి (ఇండోనేసియా)తో సింధు పోటీపడుతుంది. రెండో రౌండ్ దాటితే ప్రిక్వార్టర్స్లో సుంగ్ హ్యున్ (కొరియా)తో సింధు తలపడొచ్చు. సుంగ్ను ఓడిస్తే క్వార్టర్స్లో ఒకుహరతో సింధు అమీతుమీ తేల్చుకోవాలి. మూడో రౌండ్లో మాజీ చాంపియన్ రచానోక్, క్వార్టర్స్లో ఒలింపిక్ విజేత కరోలినా మారిన్లు ఎదురుపడే చాన్సుంది.
మరో స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు తొలి రౌండ్లో బై లభించింది. రెండో రౌండ్లో జాక్వెట్ (స్విట్జర్లాండ్) లేదా ఆలియె (టర్కీ)తో సైనా తలపడుతుంది. అక్కడ్నుంచి సైనాకు గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రిక్వార్టర్స్లో ఇంతానన్ రచనోక్ (థాయ్లాండ్), క్వార్టర్స్లో కరోలినా మారిన్ (స్పెయిన్).. సైనాకు ఎదురుపడొచ్చు.
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో గుయెన్ (ఐర్లాండ్)తో కిదాంబి శ్రీకాంత్, అభినవ్ (ఆస్ట్రేలియా)తో ప్రణయ్, సాన్ వాన్ హొ (కొరియా)తో సాయిప్రణీత్, లూకాస్ (ఫ్రాన్స్)తో సమీర్వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో డానియెల్- ఇవాన్ (బల్గేరియా)తో సుమీత్రెడ్డి- మను అత్రి, మార్కస్- క్రిస్ (ఇంగ్లాండ్)తో సాత్విక్ సాయిరాజు- చిరాగ్శెట్టి.. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో కాయ్ సిన్- హుంగ్ హాన్ (చైనీస్ తైపీ)తో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప పోటీపడతారు.