For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓటమిని గెలిచి ప్రిక్వార్టర్స్‌కు: అదరగొట్టిన సాయి ప్రణీత్

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ షట్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. తాజాగా ఇంకో నలుగురు ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు.

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ షట్లర్లు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పీవీ సింధు ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టగా.. తాజాగా ఇంకో నలుగురు ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం కిదాంబి శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, అజయ్‌ జయరాం, మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో విజయాలు సాధించారు.

బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 14-21, 21-18, 21-19తో ప్రపంచ 26వ ర్యాంకర్‌ ఆంథోనీ సినిసుకా జిన్‌టింగ్‌ (ఇండోనేసియా)పై గెలుపొందగా... శ్రీకాంత్‌ 21-9, 21-17తో లుకాస్‌ కోర్వి (ఫ్రాన్స్‌)ను ఓడించాడు.

మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లో 'బై' పొందిన సైనా నెహ్వాల్‌ రెండో రౌండ్‌లో 21-11, 21-12తో సబ్రీనా జాక్వెట్‌ (స్విట్జర్లాండ్‌)పై విజయం సాధించింది. ఈ గెలుపుతో సైనా వరుసగా ఎనిమిదోసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది.

మరో మ్యాచ్‌లో సమీర్‌ వర్మ (భారత్‌) 20-22, 9-21తో 16వ సీడ్‌ రాజీవ్‌ ఉసెఫ్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓడగా... 13వ సీడ్‌ అజయ్‌ జయరామ్‌ 21-13, 21-18తో మార్క్‌ కాల్‌జు (నెదర్లాండ్స్‌)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)తో పోరుకు సిద్ధమయ్యాడు.

సాయి ప్రణీత్ అద్భుత విజయం

ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో సాయి ప్రణీత్ అద్భుత పోరాటంతో విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో 15వ సీడ్‌ సాయి ప్రణీత్‌ 14-21, 21-18, 21-19తో ఆంటోనీ జింటింగ్‌ (పోలెండ్‌)పై గెలిచిన తీరు నిజంగా అద్భుతం. జింటింగ్‌తో 72 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి గేమ్‌లో సాయి ప్రణీత్ ఆరంభం నుంచి వెనుకబడే ఉన్నాడు. ఓ దశలో 6-16తో వెనుకబడ్డ ప్రణీత్‌.. కొంచెం పుంజుకుని 12-17తో అంతరం తగ్గించినప్పటికీ తొలి గేమ్‌లో ఓటమి పాలయ్యాడు. ఇక రెండో గేమ్‌లో సాయి ప్రణీత కోలుకుని గేమ్‌ గెలుచుకున్నాడు.

నిర్ణయాత్మక మూడో గేమ్‌ కూడా సగం వరకు హోరాహోరీగానే సాగింది. అయితే 11-11తో స్కోరు సమమైన దశలో జింటింగ్‌ చెలరేగాడు. 18-12తో ఆధిక్యంలోకి వెళ్లి విజయానికి మూడు పాయింట్ల దూరంలో నిలిచాడు. సాయిప్రణీత్‌ ఓటమి దిశగా పయనిస్తున్నా విజయంపై ఆశలు వదులుకోలేదు. కీలకదశలో ఒత్తిడికి లోనుకాకుండా సంయమనంతో ఆడిన సాయిప్రణీత్‌... నమ్మశక్యంకాని రీతిలో విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు స్కోరు చేసి 20-18తో విజయం అంచుల్లోకి వచ్చాడు. జిన్‌టింగ్‌ ఒక పాయింట్‌ గెలిచినా, వెంటనే సాయిప్రణీత్‌ మరో పాయింట్‌ సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు.

సైనా అలవోక విజయం

వ‌ర‌ల్డ్ బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో భారత షట్లర్లు దూసుకుపోతున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ 21-11, 21-12 స్కోర్‌తో స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన స‌బ్రినా జాక్వెట్‌పై విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 33 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ఆరంభం నుంచి సైనా తన హవాని కొనసాగించింది. తొలి గేమ్‌ని 21-11తో సొంతం చేసుకున్న సైనా... రెండో గేమ్‌లో కూడా అదే దూకుడుని ప్రదర్శించి 21-12తో మ్యాచ్‌ని సొంతం చేసుకుంది.

కష్టంగా గెలిచిన కిదాంబి శ్రీకాంత్

పురుషుల సింగిల్స్‌లో మరో రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ శ్రీకాంత్‌ కొంచెం కష్టంగా నెగ్గాడు. శ్రీకాంత్ 21-9, 21-17తో ఫ్రాన్స్‌ ఆటగాడు లూకాస్‌ కార్వీపై విజయం సాధించాడు. తొలి గేమ్‌ హోరాహోరీగానే ఆరంభమైనప్పటికీ 6-6తో స్కోరు సమమైంది. ఈ సమయంలో ఏకంగా 10 వరుస పాయింట్లు సాధించిన శ్రీకాంత్ ప్రత్యర్థికి అందని ఎత్తులో నిలిచాడు. 16-9తో ఆధిక్యంలో ఉన్నపుడు వరుసగా మరో ఐదు పాయింట్లు సాధించి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో శ్రీకాంత్‌ 15-9తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి పుంజుకుని స్కోరు సమం చేశాడు. అయితే శ్రీకాంత్‌ మళ్లీ తన దూకుడు చూపిస్తూ గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌.. ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడనున్నాడు.

మహిళల డబుల్స్‌‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప ఓటమి

మహిళల డబుల్స్‌‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప ఓటమి

మరోవైపు మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి-అశ్విని పొన్నప్ప (భారత్‌) 22-24, 21-19, 15-21తో రెండో సీడ్‌ కామిల్లా రైటర్‌జుల్‌-క్రిస్టినా పెడర్సన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడారు. ఆర్తి సారా-సంజన సంతోష్‌ జోడీ 14-21, 15-21తో యిక్సిన్‌ బావో-జియోహాన్‌ యు (చైనా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో మేఘన-పూర్వీషా 21-13, 16-21, 8-21తో ముస్కెన్క్‌-పియెక్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో... పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అర్జున్‌-శ్లోక్‌ 14-21, 21-19, 14-21తో మిన్‌ చున్‌-చెంగ్‌ హెంగ్‌ సు (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+