
హైదరాబాద్: దేశ రాజధానిలోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) ప్రాంగణం ఆదివారం ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ముసుగులు ధరించిన దుండగులు కర్రలు, రాడ్లు, రాళ్లతో యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేశారు. వర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి దాడులకు పాల్పడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు.
ఈ దారుణ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థి సంఘం (జేఎన్యూఎస్యూ) ప్రెసిడెంట్ ఆయిషీ ఘోష్ సహా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రెసిడెంట్ ఘోష్ తల పగలడంతో ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జేఎన్యూ హింసాత్మక దాడిపై ప్రముఖులు, బాలీవుడ్ తారలు ట్విటర్ వేదికగా మండిపడుతున్నారు. అందరూ దాడిని తీవ్రంగా ఖండించారు.
భారత బ్యాడ్మింటన్ మాజీ స్టార్ గుత్తా జ్వాల కూడా ట్విట్టర్ వేదికగా జేఎన్యూలో హింసపై మండిపడ్డారు. 'ఈ హింస ఏంటి?.. అసలు ఏం జరుగుతోంది' అని ఓ ట్వీట్లో పేర్కొంది. 'మా విద్యార్థులకు ఏం జరిగిందో చూడండి. ఇంత జరుగుతున్నా ఊరికే ఉందామా?' అని మరో ట్వీట్లో గుత్తా జ్వాల ప్రశ్నించింది. హీరోయిన్ స్వరా భాస్కర్, తాప్సీ పన్ను, షబానా అజ్మీ, రితేష్ దేశ్ముఖ్ ట్విటర్ వేదికగా దాడిని తీవ్రంగా ఖండించారు.
ఏబీవీపీ సభ్యులే విద్యార్థులపై దాడి చేశారని తాప్సీఆరోపించారు. పిల్లల భవిష్యత్కు మంచి బాటలు పడాల్సిన చోట ఇటువంటి పరిస్థితి తలెత్తింది. ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు. జేఎన్యూ పూర్వ విధ్యార్ధి, నటి స్వరా భాస్కర్ తల్లి ప్రస్తుతం జేఎన్యూలో ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. దుండగులని కఠినంగా శిక్షించాలని స్వరా భాస్కర్ తల్లి డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.