
హైదరాబాద్: వరుస బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడి అలసిపోయిన పీవి సింధు కాస్త సేదతీరుతుంది. అయితే విరామం అనంతరం పాల్గొననున్న ఈ సారి తన పతకం రంగు తప్పకుండా మార్చకుంటానని భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది.
2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. 'రజతం నుంచి పసిడి (పతకం) వర్ణంలోకి మారాలనుకుంటున్నా. నేను నా లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తా. ఆ నమ్మకం ఉంది' అని సింధు వెల్లడించింది.
రియోలో జరిగిన 2016 ఒలింపిక్స్లో కరోలినా మారిన్తో జరిగిన ఫైనల్లో హోరాహోరీగా పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. బ్రిడ్జ్స్టోన్ సంస్థ సింధుతో పాటు షట్లర్ కిదాంబి శ్రీకాంత్, బాక్సర్ మేరీ కోమ్, రెజ్లర్ సాక్షి మాలిక్, స్టీపుల్ ఛేజర్ లలిత బాబర్ను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా వారు ఆనందం వెలిబుచ్చారు.
'రియో-2016 ఒలింపిక్స్లో నా వరకు క్వార్టర్ పోరు హోరాహోరీగా సాగింది. వచ్చేసారి ఆ పరిస్థితిని మార్చుకొని ఫైనల్కు వెళ్లి పతకం సాధించాలని అనుకుంటున్నా. నా కలను తప్పకుండా నెరవేర్చుకుంటా' అని కిదాంబి శ్రీకాంత్ అన్నాడు.
'సింధు మాదిరిగానే నేనూ అవ్వాలనుకుంటున్నా. 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం గెలవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నేను టాప్-10లోకి అడుగుపెట్టా. కచ్చితంగా రాణిస్తా' అని లలిత బాబర్ పేర్కొంది. 'ప్రస్తుతం నా విభాగంలో జపాన్ నుంచి బలమైన ప్రత్యర్థి ఉన్నారు. ఆమెను ఓడించి రెజ్లింగ్లో స్వర్ణ పతకం గెలుస్తా' అని సాక్షి తెలిపింది.