హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా కంటతడి పెట్టారు. సానియా పాకిస్తాన్ కోడలు అని బీజేపీ తెలంగాణ ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్న విషయం తెలిసిందే. దీనిపై ఆమె ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొందరు తన స్థానికత పైన వ్యాఖ్యలు చేయడం బాధించిందన్నారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టారు.
తాను భారత్ తరఫున ఆడానని, పెళ్లయ్యాక కూడా భారత్ తరఫునే మెడల్స్ సాధించానని చెప్పారు. తన స్థానికత పైన వచ్చిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటన దేశంలో జరుగుతుందని తాను ఊహించలేదన్నారు. తాను భారతీయురాలు అయినందుకు గర్విస్తున్నానని చెప్పారు.
హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు ప్రభుత్వం నుండి అందాల్సిన బకాయిల పైన తాను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో మాట్లాడానని, ఆ సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా అన్నారు.

తనకు అందాల్సిన బకాయిలు రాలేదని సైనా నెహ్వాల్ ట్విట్టర్లో స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై సానియా పైవిధంగా స్పందించారని సమాచారం. మరోవైపు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం తన అదృష్టమని తెలిపారు. తన స్థానికతపై ఎలాంటి వివాదం లేదని పేర్కొన్నారు.
మెదక్ రైలు ప్రమాదం పైన...
సానియా మీర్జా మెదక్ రైలు ప్రమాదం పైన స్పందించారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై సానియా ట్వీట్ చేశారు.
ఘోర దుర్ఘటన అని, చాలా కుటుంబాలు తమ పిల్లలను కోల్పోయిన సంఘటన చాలా విషాదకరమని ఆమె పేర్కొన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవుడు బలం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు.