భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అతి త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహమాడనున్నారు. రెండు ఒలింపిక్ పతకాల విజేత, ప్రపంచ మాజీ ఛాంపియన్ సింధు పెళ్లి బాజాకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల 22న సింధు- దత్తసాయి ఒక్కటికానున్నారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో వైభవంగా వివాహం జరగనుంది.
అనంతరం డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ జరగనుంది. ఈ నెల 20 నుంచి సింధు పెళ్లి వేడుకలు మొదలు కానున్నాయి. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వెంకట దత్త సాయి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, ఇరు కుటుంబాలకు ఎప్పటినుంచో పరిచయం ఉందని పీవీ సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. నెల కిందటే పెళ్లి ఖాయం చేసుకున్నామని చెప్పారు.

వచ్చే ఏడాది జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుందని, అందుకే డిసెంబర్లో పెళ్లి ముహుర్తం పెట్టుకున్నామని పీవీ రమణ చెప్పారు. పెళ్లి వేడుకను ఉదయ్పూర్లో, రిసెప్షన్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా, పీవీ సింధు ఇటీవల రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2 సంవత్సరాల 4 నెలల 18 రోజుల తర్వాత టైటిల్ నిరీక్షణకు తెరదించింది. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచింది.
కాగా, పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకాలు నెగ్గింది. 2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచింది. 2017, 2018 ప్రపంచ ఛాంపియన్షిప్లలో రజతం, 2013, 2014లలో కాంస్య పతకాలు నెగ్గింది. ఓవరాల్గా అయిదు ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలు సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో అయిదు పతకాలు గెలిచింది.