హైదరాబాద్: ఆదివారంతో ముగిసిన వరల్డ్ ఛాంపియన్ మెగా ఈవెంట్లో భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్లు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. పీవీ సింధు రజతంతో మెరవగా, సైనా నెహ్వాల్ కాంస్య పతకం సాధించింది. సెమీస్, ఫైనల్లో ఈ ఇద్దరినీ ఓడించిన జపాన్ ప్లేయర్ నొజోమి ఒకుహరా స్వర్ణం గెలుచుకుంది.
గ్లాస్కో వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో మ్యాచ్ షెడ్యూల్ సరిగ్గా ఉంటే భారత అభిమానులు కోరుకున్నట్టు సైనా, సింధు ఫైనల్లో తలపడే అవకాశం ఉండేది. క్వార్టర్ ఫైనల్ ముగిసిన గంటల వ్యవధిలోనే సెమీస్లో బరిలోకి దిగడం సైనా ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె కోచ్ విమల్ కుమార్ అన్నారు.
అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్ తర్వాత సెమీస్కు సమాయత్తమయ్యేందుకు సైనాకు తగిన సమయం దొరకలేదని పేర్కొన్నాడు. సెమీస్లో సైనా ఓటమికి చెత్త షెడ్యూలే కారణమని ఆయన ఆరోపించాడు. వరల్డ్ చాంపియన్షిప్స్, ఒలింపిక్స్ లాంటి పెద్ద ఈవెంట్లలో అయినా కచ్చితమైన షెడ్యూల్ ఉండాలని కోరాడు.

'సైనాకు ఇలా జరగడం దురదృష్టకరం. అర్ధరాత్రి వరకు క్వార్టర్ఫైనల్ ఆడిన సైనా.. ఉదయాన్నే సెమీస్లో తలపడాల్సి వచ్చింది. నేనైతే మొత్తం షెడ్యూలింగ్లోనే లోపం ఉందని భావిస్తున్నాన'ని పేర్కొన్నాడు. టీవీ ప్రసారాలు.. షెడ్యూల్ను ప్రభావితం చేయకూడదని ఆయన స్పష్టం చేశాడు.
'దీనికి పూర్తి బాధ్యత టెక్నికల్ అధికారులదే. రెండు మ్యాచ్ల మధ్య ఆటగాళ్లకు తగిన సమయం ఉండేలా చూడాల్సింది వారే. చెన్లాంగ్, శ్రీకాంత్ కూడా అర్ధరాత్రి మ్యాచ్లు ఆడి మళ్లీ ఉదయాన్నే బరిలోకి దిగాల్సి వచ్చింది' అని విమల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. సైనాపై విజయం సాధించిన జపాన్ ప్లేయర్ ఒకుహరాపై విమల్ ప్రశంసలు కురిపించాడు.
'ఒకుహరాపై సైనాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. తొలి గేమ్లో అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా నెమ్మది పరిస్థితుల్లో ఆమె రాణించిన తీరు అద్భుతం. ప్రత్యర్ధిపై ఎదురుదాడికి దిగి తనదైన శైలిలో మట్టికరిపిస్తుంది' అని విమల్ పేర్కొన్నాడు.