సియోల్: దక్షిణ కొరియాలోని సుంచెయాన్లో సాగుతున్న కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు తేజాలు మెరిశాయి. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్.. తమ ప్రత్యర్థులపై అలవోకగా విజయాలను సాధించారు. విమెన్స్ సింగిల్స్, మెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్స్లో అడుగు పెట్టారు. టైటిల్ను సాధించడానికి వారిద్దరూ రెండడుగుల దూరంలో నిలిచారు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్లో విజయం సాధించగలిగితే కొరియా ఓపెన్ వారిద్దరి వశమౌతుంది.
రెండుసార్లు ఒలింపిక్స్ మెడల్ విజేత పీవీ సింధు.. క్వార్టర్ ఫైనల్స్లో అలవోకగా విజయాన్ని అందుకుంది. క్వార్టర్స్లో థాయ్లాండ్కు చెందిన బుసానన్ ఒంగ్బమ్రుంగ్ఫాన్ను వరుస సెట్లలో ఓడించింది. 21-10, 21-16 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్స్లో ఆమె జపాన్ స్టార్ షట్లర్ సయెనా కవాకమి లేదా సెకెండ్ సీడెడ్ కొరియన్ ప్లేయర్ యాన్ సియోంగ్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిద్దరూ క్వార్టర్స్ ఫైనల్స్ ఆడాల్సి ఉంది.
మరో మ్యాచ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ వెండి పతక విజేత కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లో పోరాడాల్సి వచ్చింది. దక్షిణ కొరియాకే చెందిన సొన్ వాన్ హొపై గెలవడానికి చెమటోడ్చాడు. 21-12, 18-21, 21-12 తేడాతో నెగ్గాడు. తొలి సెట్ను శ్రీకాంత్ ఏకపక్షంగా మార్చుకున్నాడు. 21-12 తేడాతో గెలిచాడు. రెండో సెట్లో లోకల్ బాయ్ చెలరేగాడు. దీనితో ఆ సెట్ను 18-21తో కోల్పోయాడు. ఆ వెంటనే శ్రీకాంత్ పుంజుకొన్నాడు. మూడో సెట్ను కూడా 21-12 తేడాతో గెలిచాడు.
సొన్ వాన్ హోపై శ్రీకాంత్కు చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డ్ లేదు. ఇప్పటివరకు వారిద్దరూ 11 సార్లు తలపడ్డారు. అతణ్ని ఎదుర్కొన్న చివరి మూడు మ్యాచ్లల్లో ఓడాడు. ఈ సారి మాత్రం అలాంటి అవకాశం ఇవ్వలేదు. రెండో సెట్ను కోల్పోయినప్పటికీ.. పట్టు వదల్లేదు. తొలి సెట్ తరహాలోనే మూడో సెట్లోనూ విజృంభించి ఆడాడు. పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తమ కేటగిరీల్లో ముందడుగు వేశారు. మిగిలిన ప్లేయర్ల నిరాశపరిచారు.