టోక్యో: ఇన్నేళ్లుగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం పీవీ సింధు తెలిపింది. తనను చాలా ఎమోషన్స్ వెంటాడుతున్నాయంది. కాంస్య పతకం గెలిచినందుకు సంతోషించాలో.. ఫైనల్లో ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదని సింధు పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్లో సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. ఆదివారం హి బింగ్జియావో ( చైనా)తో జరిగిన మ్యాచ్లో 21-13, 21-15 తేడాతో వరుస గేమ్స్లో గెలిచి కాంస్య పతకం సాధించింది.
మ్యాచ్ అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడుతూ... 'ఇన్నేళ్లుగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నన్నుచాలా ఎమోషన్స్ వెంటాడుతున్నాయి. కాంస్య పతకం గెలిచినందుకు సంతోషించాలో.. లేదా ఫైనల్లో ఆడే అవకాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనా ఈ మ్యాచ్ ఆడే సమయంలో నా భావోద్వేగాలు అన్నింటినీ పక్కనపెట్టి.. శాయశక్తులా ఆడాను. ఇప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి మెడల్ సాధించిపెట్టినందుకు గర్వపడుతున్నా' అని తెలిపింది.
'శనివారం జరిగిన మ్యాచ్లో మేమిద్దరం ( పీవీ సింధు, హి బింగ్జియావో) ఇద్దరం ఓడిపోయాం. మా ఇద్దరికీ ఈ మ్యాచ్ చాలా ముఖ్యం. దేశం కోసం మెడల్ గెలవాల్సిన బాధ్యత మాపైన ఉంది. ఇలాంటి సమయంలో పోరాడటం అంత సులువు కాదు. చాలా పెద్ద విషయం. ఈ మ్యాచ్లో గెలవడం కోసం చాలా ఓపిగ్గా ఉన్నా. ఆధిక్యంలో ఉన్నప్పటికీ విశ్రమించలేదు. రియో కంటే చాలా కష్టపడాల్సి వచ్చింది' అని తెలుగు తేజం సింధు చెప్పుకొచ్చింది.
'దేశం కోసం మెడల్ సాధించడం నాకే కాదు అందరికీ గర్వంగా ఉంటుంది. ఈ మధుర క్షణాలను చాలా ఎంజాయి చేస్తున్నా. చాలామంది యువతీయువకులు.. ఈ పతకాల్ని చూసి స్పూర్తి పొందుతారు. ఒలింపిక్స్లో పాల్గొనేలా కష్టపడాతారు. చేయగలను, సాధించగలను అనుకుంటే ఎవరైనా గెలవగలరు. నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపించిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. 2024 పారిస్ ఒలింపిక్స్లో కచ్చితంగా బంగారం గెలుచుకునేలా కష్టపడతాను' అని పీవీ సింధు పేర్కొంది. తన గెలుపు కోసం కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడ్డారని పేర్కొంది. అలాగే స్పాన్సర్స్ కూడా ఎంతగానో ప్రోత్సహించారని ఆమె చెప్పింది. ఈ సందర్భంగా వారందరికీ సింధు కృతజ్ఞతలు తెలిపింది.