
టోక్యో: ఒలింపిక్స్ 2020 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం సెమీ ఫైనల్స్లో ఓడిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు భావోద్వేగం చెందింది. ఫైనల్కు వెళ్లనందుకు తాను చాలా బాధపడుతున్నానని తెలిపింది. మొదటి గేమ్ని గెలవాల్సి ఉందని.. కానీ ప్రత్యర్థి పుంజుకోవడంతో అది సాధ్యం కాలేదని సింధు పేర్కొంది. ఎంతో మంది భారతీయ అభిమానులు తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇక ఆదివారం జరిగే మ్యాచ్లో పతకం సాధించేందుకు శక్తి మేరకు కృషి చేస్తానని తెలుగు తేజం చెప్పుకొచ్చింది.
చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18-21, 12-21 తేడాతో పీవీ సింధు ఓటమిపాలైంది. మ్యాచ్ ప్రారంభంలో కాస్త ఆధిపత్యం చెలాయించిన సింధు.. తొలి విరామం తర్వాత వెనుకపడింది. ఈ క్రమంలోనే అనూహ్యంగా పుంజుకున్న తై జు తర్వాత సింధూకు గట్టి పోటీ ఇచ్చింది. దాంతో తొలి గేమ్లో సింధు ఓటమిపాలైంది. ఇక రెండో గేమ్లోనూ మరింత పట్టుదలగా ఆడిన తై జు.. సింధుకు ఏ అవకాశం ఇవ్వలేదు. దాంతో సింధు రెండు వరుస గేమ్స్లో ఓటమిపాలైంది.
మ్యాచ్ అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ... 'నేను మొదటి గేమ్ని గెలుస్తా అనిపించింది. కానీ అంత సులభం కాలేదు. ఇదంతా ఆటలో భాగమే. సానుకూలంగా ముందుకు సాగాలి. నేను మొదటి గేమ్ గెలిచి ఉంటే.. ఫలితం వేరుగా ఉండేది. సెమీఫైనల్ మ్యాచ్ అంటే అత్యుత్తమ ప్లేయర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరూ అత్యున్నత ప్రదర్శన ఇవ్వడానికే చూస్తారు. తై జు బలబలాను అంచనా వేసే బరిలోకి దిగాను. కానీ తను నాపై పైచేయి సాధించింది. సెమీస్లో పాయింట్లు సాధించడం అంత తేలికేమీ కాదు. తై జు బాగా ఆడింది' అని తెలిపింది.
'సెమీ ఫైనల్లో ఓడినందుకు బాధగానే ఉంది. చివరికంటా నా శక్తిమేరకు పోరాడాను. కానీ ఈరోజు నాది కాకుండా పోయింది. ఎంతో మంది భారతీయ అభిమానులు నాకు మద్దతుగా నిలిచారు. అయితే రేపటి మ్యాచ్లో పతకం సాధించేందుకు శక్తి మేరకు కృషి చేస్తా' అని పీవీ సింధు ధీమా వ్యక్తం చేసింది. సెమీస్లో సింధు గెలుపు కోసం వంద శాతం కృషి చేసిందని ఆమె తండ్రి పీవీ రమణ తెలిపారు. సింధూ కంటే తై జుకు మెరుగైన రికార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింధు అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిందని, అదే ఓటమికి కారణమన్నారు. సింధు ప్రత్యర్థి తై జు వరల్డ్ ఛాంపియన్, ఆమె చాలా వ్యూహాత్మకంగా ఆడింది అని రమణ తెలిపారు.