
హైదరాబాద్: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓడి స్వర్ణం సాధించలేదనే బాధ కంటే రజత పతకం సాధించడం సంతోషంగా ఉందని స్టార్ షట్లర్ పీవీ సింధు అన్నారు. స్వర్ణ పతకం సాధించేందుకు తన శక్తిమేర కృషి చేశానని పేర్కొన్నారు. ఫైనల్ ప్రత్యర్థి మారిన్కు తొలి రౌండ్లో గట్టి పోటీ ఇవ్వగలిగానని తెలిపారు. చైనాలో ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో సింధు రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.
అనంతరం స్వదేశానికి చేరుకున్న సింధు మంగళవారం గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది పెద్ద టోర్నీ అని.. అక్కడ అందరూ సమఉజ్జీలే తలపడతారని ఆమె గుర్తు చేశారు. ప్లేయర్లంతా పతకం సాధించాలనే లక్ష్యంతోనే అక్కడికి వస్తారన్నారు. అందరిలాగే తాను కూడా వెళ్లానని గుర్తు చేశారు. కానీ, తాను వంద శాతం ఏకాగ్రతతో ఆడడం వల్లే రజత పతకం సాధించగలిగానన్నారు.
అందరూ అనుకున్నట్లు తనకు ఫైనల్ ఫోబియా లేదని.. చాలామంది ఫైనల్కు రాకుండానే వెనుదిరుగుతున్నారని సింధు తెలిపారు. ఫైనల్లో ఓడిపోయానని బాధపడే బదులు.. తన ఖాతాలో మరో పతకం వచ్చిందని సంతోషపడతానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది తనకు స్వర్ణ పతకం వచ్చేందుకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. తాను ప్రతిసారి ఫైనల్కు వచ్చి ఓడిపోతున్నానని చాలామంది అడుగుతున్నారని.. కానీ ఫైనల్కు రావడం ఎంత కష్టమో వారు తెలుసుకోవాలన్నారు. ఫైనల్లో ఎవరైనా గెలవడానికే ఆడతారని పేర్కొన్నారు.
ఫైనల్లో ఒడిపోయినందుకు కొంత బాధ ఉన్నప్పటికీ.. తన బలహీనతల నుంచి మరింత నేర్చుకుని అనుకున్న ఫలితం సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని సింధు అన్నారు. ఈ మేరకు పుల్లెల గోపీచంద్ కూడా సింధుకు మద్దతునిచ్చారు. సింధు చాలా కష్టపడిందని, ఫైనల్ మ్యాచ్లో కాస్త తప్పిదాలు చేసిన మాట వాస్తవమేనని అయితే వీటిని అధిగమించేలా ప్రాక్టీసు చేస్తామని తెలిపారు. ఫైనల్ వరకూ వెళ్లడమంటే మూమూలు విషయం కాదని, అది అర్థం చేసుకోకుండా ఏవేవో ప్రచారాలు చేయవద్దంటూ వివరించారు.