హైదరాబాద్: భారత స్టార్ ప్లేయర్లు పీవీ సింధు, పారుపల్లి కశ్యప్.. థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశారు. బుధవారం మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-8, 21-15 తేడాతో లిండా (బల్గేరియా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది. చీలమండ గాయం నుంచి కోలుకున్న తర్వాత రెండో టోర్నీ ఆడుతున్న తెలుగమ్మాయి ఈ మ్యాచ్లో మునుపటి ఫామ్ను చూపెట్టింది. ప్రి క్వార్టర్స్లో సింధు.. యిప్ పూ యిన్ (హాంకాంగ్)తో తలపడనుంది.
మహిళల డబుల్స్లో మేఘన- పూర్విష జోడీ, మిక్స్డ్ డబుల్స్లో సౌరభ్- అనౌష్క జంట, తరుణ్- సౌరభ్ ద్వయం కథ ముగిసింది. మహిళల సింగిల్స్లో వైష్ణవి రెడ్డి కథ ముగిసింది. తొలి రౌండ్లో వైష్ణవి 13-21, 17-21తో సయాక (జపాన్) చేతిలో పరాజయం చెందింది.
పురుషుల విభాగంలో:
పురుషుల సింగిల్స్లో నాలుగో సీడ్ ప్రణయ్ కూడా క్వార్టర్స్ చేరాడు. తొలి రౌండ్లో ప్రణయ్ 21-16, 21-19తో పాబ్లో అబియన్ (స్పెయిన్)పై గెలిచాడు. పారుపల్లి కశ్యప్ కూడా ముందంజ వేశాడు. తొలి రౌండ్లో పారుపల్లి కశ్యప్ 21-15, 21-17తో జాసన్ అంటోనీ (కెనడా)పై నెగ్గాడు. మరోవైపు పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మకు చుక్కెదురైంది. తొలి రౌండ్లో సమీర్ 18-21, 16-21తో తనోంగ్స్సక్ (థాయిలాండ్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
పురుషుల డబుల్స్లో మను అత్రి- సుమీత్ రెడ్డి జోడీ 21-18, 15-21, 21-17తో చెన్- వాంగ్ చీ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్లో అర్జున్- రామచంద్రన్ జోడీ 18-21, 21-13, 16-21తో వాహ్యూ- యుసఫ్ (ఇండోనేషియా) జంట చేతిలో, అనిల్కుమార్- వెంకట్ జంట 21-14, 12-21, 14-21తో చంగ్- చున్ (హాంకాంగ్) ద్వయం చేతిలో ఓడింది.