
బ్యాంకాక్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా గతేడాది ఆటలన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దాదాపు పది నెలల సుదీర్ఘ విరామం తర్వాత తొలి బ్యాడ్మింటన్ టోర్నీ థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్ మంగళవారం ప్రారంభం అయింది. అయితే టోర్నీ మొదటి రోజే ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని వార్తలు రాగా.. అవన్నీ అవాస్తవమని తాజాగా తెలిసింది. దీంతో బుధవారం తమ తొలి రౌండ్ మ్యాచ్లు ఆడేందుకు ఇద్దరికీ లైన్ క్లియర్ అయింది.
టోర్నీ ఆరంభానికి ముందు షట్లర్లకు కొవిడ్-19 పరీక్షలు చేయగా.. భారత షట్లర్లు సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ మంగళవారం ఉదయం వెల్లడించింది. జనవరి 11న నిర్వహించిన మూడో రౌండ్ తప్పనిసరి పరీక్షలో సైనాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందనేది అబద్ధమని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం నుంచి సైనా టోర్నీలో పాల్గొనవచ్చని కూడా పేర్కొంది.
సైనా భర్త, షట్లర్ పారుపల్లి కశ్యప్ కూడా బుధవారం నుంచి బరిలో దిగనున్నాడు. సైనాతో కలిసి కాంటాక్ట్ అయినందున కశ్యప్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని నిర్వాహకులు ఆదేశించిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఈ ముగ్గురు ప్లేయర్లు ఇవాళ టోర్నీ నుంచి విత్డ్రా చేసుకోవడంతో.. ప్రత్యర్థి క్రీడాకారులకు వాకోవర్ లభించింది. సోమవారం నిర్వహించిన కరోనా టెస్ట్ రిపోర్ట్ తనకు ఇంకా అందలేదని సైనా ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఇక స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్కి చేదు అనుభవం ఎదురైంది. కరోనా వైరస్ పరీక్ష నిర్వహిస్తున్న సమయంలో నిర్వాహకుల దురుసు ప్రవర్తన కారణంగా అతని ముక్కుకి గాయమైంది. ముక్కులోనుంచి రక్తం కారింది. రక్తం కారుతున్న ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీకాంత్.. థాయ్లాండ్ ఓపెన్ నిర్వాహకుల తీరుపై విమర్శలు గుప్పించాడు. తనతో వారు వ్యవహరించిన తీరు ఏమాత్రం బాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. టోర్నీకి ముందే తాను నాలుగు సార్లు వైరస్ పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పాడు.