
బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ థాయ్లాండ్ ఓపెన్ సూపర్-1000 టోర్నమెంట్లో బోణీ కొట్టింది. మహిళల సింగిల్స్లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్లో వరుస సెట్లలో విజయం సాధించింది. సైనా 21-15, 21-15 తేడాతో మలేషియాకు చెందిన కిసినో సెల్వాడ్రీపై గెలిచింది. రెండు గేమ్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సైనా అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుని రెండో రౌండ్కు అర్హత సాధించింది.
కిదాంబి శ్రీకాంత్ కూడా థాయ్లాండ్ ఓపెన్లో ముందంజ వేశాడు. పురుషుల సింగిల్స్లో సహచరుడు సౌరభ్ వర్మతో జరిగిన పోరులో 21-12, 21-11తో విజయం సాధించాడు. కేవలం 30 నిమిషాల్లో మ్యాచును ముగించి రెండో రౌండ్కు అర్హత సాధించాడు. అంతకుముందు కరోనా పరీక్ష వల్ల శ్రీకాంత్ ముక్కులోంచి రక్తస్రావం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బీడబ్ల్యూఎఫ్ పరీక్షల ప్రక్రియ సాఫీగా సాగేలా జోక్యం చేసుకుంది.
ఇక మరో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్ మ్యాచ్ మధ్యలోనే నిష్క్రమించాడు. కెనడా షట్లర్ జేసన్ ఆంథోనితో జరుగుతున్న పోరులో మూడోరౌండ్లో 8-14తో వెనకబడినప్పుడు అతడు ఆటను వదిలేశాడు. పిక్క కండరాలు పట్టేయడంతో అతడీ నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందు మొదటి గేమ్లో 9-21తో వెనకబడ్డ అతడు రెండో గేమ్లో పోరాడి 21-13తో నిలిచాడు.
పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్శెట్టి జోడీ కొరియన్ ద్వయం కిమ్ జి జంగ్, లీ యాంగ్ డేపై 19-21, 21-16, 21-14తో విజయం సాధించింది. తాము ఆదర్శంగా భావించే లీ యాంగ్ డేపై గెలిచినందుకు సాత్విక్, చిరాగ్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా అర్జున్ ముదతిల్ రామచంద్రన్, ధ్రువ్ కపిల జోడీ మలేసియా ద్వయం ఆంగ్ యీ సిన్, టియో ఈ యి చేతిలో 21-13, 8-21, 22-24 తేడాతో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి, సుమీత్ రెడ్డి ద్వయం 20-22, 17-21 తేడాతో చంగ్ మన్ తంగ్, యోంగ్ సూట్ సె చేతిలో ఓటమి పాలైంది.